కన్నీళ్లు పెట్టిన కరుణ

కన్నీళ్లు పెట్టిన కరుణ - Sakshi


సాక్షి, చెన్నై : డీఎంకే అధినేత ఎం.కరుణానిధి విలపించారు. తన సోదరి ఇక లేదన్న సమాచారంతో కన్నీళ్ల పర్యంతం అయ్యారు. శోక సంద్రంలో మునిగిన ఆయన్ను పీఎంకే అధినేత రాందాసు, డీఎంకే వర్గాలు ఓదార్చే యత్నం చేశాయి. షణ్ముగ సుందరత్తమ్మాల్(99) భౌతిక కాయానికి గురువారం అంత్యక్రియలు జరగనున్నాయి. ముత్తు వేలర్, అంజుగత్తమ్మాల్ దంపతుల కుమారుడు డీఎంకే అధినేత ఎం కరుణానిధి అన్న విషయం తెలిసిందే. ఆయనకు  ఇద్దరు అక్కయ్యలు. పెద్ద అక్కయ్య పెరియ నాయకీ ఎప్పుడో కాలం చెందారు.  



రెండో అక్కయ్య షణ్ముగ సుందరత్తమ్మాల్ అంటే, కరుణానిధికి ప్రాణం. ఆమె మాటను నేటికి కూడా ఆయన జవదాటరు. ఆమె అంటే, కరుణానిధికి గౌరవం, మర్యాద, ఆప్యాయత ప్రేమా అభిమానులు ఎక్కువే. కుటుంబ పెద్ద గా ఆమెను భావిస్తుంటారు. కరుణ కుటుం బంలో ఎదురైన అనేక సంక్లిష్ట పరిస్థితుల్ని ఆమె దారిలో పెట్టారని చెప్పవచ్చు. షణ్ముగ  సుందరత్తమ్మాల్ పెద్దకుమారుడే కేంద్ర మాజీ మంత్రి, దివంగత నేత మురసోలి మారన్.  



అందుకే మేనల్లుడు  మురసోలి మారన్ అంటే కరుణకు ఎంతో ఇష్టం. ఆయన బతికి ఉన్నంత కాలం కరుణ వెన్నంటి ఉన్నారని చెప్పవచ్చు. ఇక, మురసోలి మారన్, మల్లికా మారన్‌ల పిల్లలే కేంద్ర మాజీ మంత్రి దయానిధి మారన్ , సన్ టీవీ గ్రూప్ అధినేత  కళానిధి మారన్. కరుణానిధి కుటుంబానికి పెద్ద దిక్కుగా ఉంటూ వచ్చిన షణ్ముగత్తమ్మాల్ (99) కొంతకాలంగా వయోభారంతో బాధ పడుతున్నారు. గోపాల పురంలోని ఇంట్లో ఉంటూ వైద్య సేవలు పొందుతూ వచ్చారు.

 

కన్నీళ్లు పెట్టిన కరుణ: బుధవారం ఉదయం పద కొండు గంటలకు షణ్ముగ సుందరత్తమ్మాల్ మరణించిన సమాచారం కరుణానిధిని శోక సంద్రంలో ముంచేసింది. వయో భారంతో బాధపడుతున్న అక్కయ్యను వా రంలో ఓ మారైనా కలిసి వెళ్లే కరుణానిధి , ఇక ఆమె లేరన్న సమచారంతో దిగ్భ్రాంతికి గురి అయ్యారు. పార్టీ కోశాధికారి, తనయుడు స్టాలిన్‌తో కలసి ఆమె ఇంటికి చేరుకుని భౌతిక కాయాన్ని చూస్తూ కన్నీళ్ల పర్యంతం అయ్యారు.



ఆమె చేతుల్ని పట్టుకుని బోరున విలపించారు. ఆయన్ను ఓదార్చడం  ఎవరి తరం కాలేదు. కరుణానిధి సైతం వయోభారంతో ఉన్న దృష్ట్యా, ఆయన్ను అక్కడి నుంచి మరో గదికి వెంటనే తీసుకెళ్లి పోయారు. అనంతరం ఆమె భౌతిక కాయాన్ని కుటుంబీ కులు, ఆప్తుల సంద ర్శనార్థం గోపాల పురం ఇంట్లో ఉంచారు. సమాచారం అందుకున్న షణ్ముగ సుందరత్తమ్మాల్ చిన్న కుమారుడు మురసోలి సెల్వం, కోడలు సెల్వి, మనవళ్లు, మనవరాళ్లు, కుటుంబీకులు దయానిధి మారన్, కళానిధి మారన్, మూక్తా తమిళరసు, అమృతం, డిఎంకే నాయకులు దురై మురుగ న్, టీ ఆర్ బాలు, ఎ రాజ, విపీ దురై స్వామి, అన్భలగన్, శేఖర్ బాబు, ఎం సుబ్రమణియన్ తదితరులు ఆమె భౌతిక కాయానికి నివాళులర్పించారు.

 

నేడు అంత్యక్రియలు : షణ్ముగ సుందరత్తమ్మాల్ భౌతిక కాయానికి గురువారం అం త్యక్రియలు జరగనున్నాయి. గోపాల పురం ఇంటి నుంచి ఉదయం పది గంటలకు ఊరేగింపుగా భౌతిక కాయాన్ని బీసెంట్ నగర్ వ్మశాన వాటికకు తీసుకెళ్లనున్నారు. సోదరిని కోల్పోయి తీవ్ర విషాదంలో మునిగిన కరుణానిధిని పలువురు నాయకులు పరామర్శించి ఓదార్చే పనిలో పడ్డారు. పీఎంకే అధినేత రాందాసు ఓ ప్రకటన ద్వారా తన సానుభూతి తెలియజేశారు. అక్కయ్య అంటే కరుణానిధి ఎంతో మర్యాద, ప్రేమ,ఆప్యాయతల్ని కల్గి ఉన్నారన్నారు.  కష్టాల్లో కరుణానిధి వెన్నంటి ఆమె ఉన్నారని, ఆమె లేని లోటు ఆయనకు  తీర్చలేనిదిగా పేర్కొన్నారు.

Read latest State News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top