అలాంటి ఆశ లేదు


మళ్లీ ముఖ్యమంత్రి కావాలనే ఆశ తనకు ఎంతమాత్రం లేదని డీఎంకే అధ్యక్షుడు కరుణానిధి చెప్పారు. పార్టీ ప్రతిష్టను మరింత పెంచేందుకు పాటుపడుతానన్నారు. స్టాలిన్ సీఎం పీఠం ఎక్కడానికి మార్గం సుగమం చే సే రీతిలో పార్టీ శ్రేణులకు సంకేతాలిచ్చారు.

 

 చెన్నై,సాక్షి ప్రతినిధి:వృద్ధాప్యంతో రోజు రోజుకూ బలహీనపడుతున్న కరుణానిధికి వారసుడు ఎవరనేది రెండేళ్లుగా రాష్ట్రంలో ప్రధాన  చర్చనీయాంశంగా మారింది. ఇక ఆ పార్టీలో స్టాలిన్‌ది పైచేయిగా మారిపోగా, కుటుంబంలో కరుణ పెద్దకుమారుడు అళగిరి, స్టాలిన్ మధ్య వారసత్వ యుద్ధమే సాగుతోంది. వారసత్వాన్ని అందిపుచ్చుకోవడం కోసం స్టాలిన్ వేసిన పాచికలకు అళగిరి బలయ్యారు. స్టాలిన్ వ్యూహంతో అళగిరికి కరుణతో విభేదాలు ముదిరిపోగా పార్టీ నుంచి బిహ ష్కరించే పరిస్థితి వచ్చింది. ఇదే అదనుగా కరుణకు స్టాలిన్ మరింత సన్నిహితుడయ్యారు. ప్రతి పార్టీ సమావేశాల్లో వచ్చే ఎన్నికల్లో కరుణ సీఎం కావడం ఖాయమని స్టాలిన్  వ్యాఖ్యానిస్తూ ముఖ్యమంత్రి పీఠంపై తన ఆసక్తిని పరోక్షంగా గుర్తుచేస్తూనే ఉన్నారు. అనేక సమావేశాల్లో కరుణ సైతం స్టాలిన్ తన వారసుడని పరోక్షంగా ప్రస్తావిస్తూనే ఉన్నారు. ఈ దశలో స్టాలిన్ జన్మదినోత్సవాలు శనివారం చెన్నై వైఎంసీఏ మైదానంలో శనివారం ప్రారంభమయ్యాయి.

 

 ఈ సందర్భంగా 20 వేల మందికి రూ.1కోటి విలువైన వస్తువులను ప్రజలకు ఉచితంగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జరిగిన సభలో కరుణ నిర్వేదపూరితమైన వ్యాఖ్యలు చేశారు. ప్రతి ఏడాది స్టాలిన్ జన్మదిన వేడుకల్లో పాల్గొంటున్నానని, భవిష్యత్తులో రాజకీయ గడ్డు పరిస్థితులు ఎదురైతే వాటిని అధిగమించి రాజకీయాల్లో ముందుకు సాగేందుకు స్టాలిన్‌కు కొన్ని మెళకువలు తప్పవని అన్నారు. ఎవరిని చేరదీయాలి, ఎవరిని దూరంగా ఉంచాలి, ఏ నేతతో ఎలా నడుచుకోవాలో స్టాలిన్‌కు తెలియజెప్పేందుకు ఈ కార్యక్రమం వేదికగా భావిస్తున్నానన్నారు. పేదల కష్టనష్టాలు తెలుసుకున్నందునే విలువైన వస్తువులు ఉచితంగా పంచుతున్నామని, వీటిని స్వీకరించిన వారు స్టాలిన్ మరిన్ని జన్మదినాలు జరుపుకునేలా దీవించాలని కోరారు.

 

 తన కంటే ముందు ప్రసంగించిన వారు తాను ఆరోసారి ముఖ్యమంత్రి కావాలని ఆశించారని, అయితే తనకు అటువంటి ఆశలేదని చెప్పారు. డీఎంకేని మరింత పటిష్టం చేయాలనేదే తన లక్ష్యమని చెప్పారు. పేద, బడుగు, బలహీన వర్గాల ప్రజల సంక్షేమానికి పార్టీ అంకితం కావాలని పిలుపునిచ్చారు. ప్రజలను మరిస్తే రాష్ట్రంలో కృత ఘు్నలుగా మిగిలిపోగలమని హెచ్చరించారు. అన్నాదురై తమ్ముళ్లుగా గర్వపడుతూ ఆయన ఆశయాలు నెరవేర్చాలని, పార్టీ పేరు ప్రతిష్టలను నిలబెట్టాలని కోరారు. ఒకటి, రెండురోజులు పార్టీ సమావేశాలను నిర్వహించి విశ్రమించరాదని, నిరంతరం ప్రజల కోసం పోరాడాలని అన్నారు. తమిళం వర్ధిల్లాలి, పార్టీ వర్ధిల్లాలి అనే నినాదాన్ని నలుచెరగులా చాటాలని పిలుపునిచ్చారు. తాను ఇక పార్టీకే పరిమితం ముఖ్యమంత్రి పీఠం స్టాలిన్‌కు అంకితం అనే సంకేతాలను కరుణ ఇచ్చారు.  

 

Read latest State News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top