సింగపూర్ రహస్యం చంద్రబాబుకే తెలుసు
హైదరాబాద్: స్విస్ ఛాలెంజ్ విధానాన్ని ఖేల్కర్ కమిటీ తప్పుపట్టిందని, అయినా సింగపూర్ కన్సార్టియంకు రాజధాని భూములు కట్టబెట్టి వేలకోట్ల రూపాయల దోపిడీకి తెరదీశారని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకర్ రెడ్డి విమర్శించారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికే సింగపూర్ రహస్యం తెలుసని అన్నారు.
స్విస్ ఛాలెంజ్ విధానం వద్దని ప్రజలు అభ్యంతరం చెబుతున్నారని, కొన్ని కంపెనీలు కోర్టుకు కూడా వెళ్లాయని భూమన చెప్పారు. చట్ట సవరణ చేసి మళ్లీ సింగపూర్ కన్సార్టియంకే భూములు ఇస్తున్నారని తెలిపారు. సింగపూర్ కంపెనీలతో లోపాయికారి ఒప్పందం చేసుకున్నారని, ఇతరులు బిడ్డింగ్లో పాల్గొనకుండా చేశారని ఆరోపించారు. విదేశీ కంపెనీకి చంద్రబాబు తాబేదారుగా మారారని విమర్శించారు. సాధారణమైన డెవలప్మెంట్ను విదేశీ సంస్థకు కట్టబెట్టారని, దేశంలోని ఇంజినీరింగ్ నైపుణ్యం పనికిరాదా అని భూమన ప్రశ్నించారు.