కరీంనగర్లో పరిమళించిన మానవత్వం
కరీంనగర్ : కరీంనగర్ జిల్లాలో మానవత్వం పరిమళించింది. కుటుంబ సభ్యులు మృతి చెందితే వదిలివేస్తున్న ఈ రోజుల్లో ఇంట్లోని గోమాత మరణిస్తే సాంప్రదాయ పద్ధతిలో అంత్యక్రియలు నిర్వహించి తమ మమకారాన్ని చాటుకున్నారు. ఈ ఘటన చొప్పదండి మండలం ఆర్నకొండ గ్రామంలో ఓ రైతు కుటుంబంలో చోటుచేసుకుంది.
గ్రామానికి చెందిన గుంటు దుర్గయ్యకు చెందిన గోమాత శనివారం లేగదూడకు జన్మనిచ్చింది. పండుగపూట పాడిఆవు దూడకు జన్మనివ్వడంతో రైతు కుటుంబం ఆనందంలో మునిగిపోయింది. ఆ సంతోషం క్షణాల్లో ఆవిరయ్యింది. అనారోగ్య కారణాలతో గోమాత కొద్దిసేపటికే ప్రాణాలు కోల్పోయింది. దీంతో గోమాతతో తమకున్న అనుబంధాన్ని తలుచుకుంటూ తల్లిని కోల్పోయిన లేగదూడను పట్టుకుని రైతు కుటుంబసభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించారు. కుటుంబసభ్యుని కోల్పోయినంత దుఃఖంతో అంత్యక్రియలకు ఏర్పాట్లు చేశారు. గోమాత దేహాన్ని ఎడ్లబండి మీద గ్రామంలో అంతిమయాత్ర నిర్వహించారు. దుర్గయ్య కుటుంబ సభ్యులతో పాటు బంధువులు కన్నీటి వీడ్కోలు పలికి పొలంలో సమాధి చేశారు. గోమాత పట్ల చూపిన మమకారంపై గ్రామస్తులు దుర్గయ్య కుటుంబాన్ని అభినందించారు.
సంబంధిత వార్తలు