‘వైమానిక దాడుల్లో మీ కొడుకు చనిపోయాడు’

‘వైమానిక దాడుల్లో మీ కొడుకు చనిపోయాడు’


ముంబై: ఇస్లామిక్‌ స్టేట్‌ ఉగ్రవాద సంస్థలో చేరిన మహారాష్ట్రలోని కల్యాణ్‌కు చెందిన యువకుడు అమన్‌ టాండెల్‌ మరణించినట్టు కుటుంబ సభ‍్యులకు సమాచారం అందింది. వైమానిక దాడుల్లో అమన్‌ చనిపోయినట్టు ఓ గుర్తు తెలియని వ్యక్తి అతని ఇంటికి ఫోన్‌ చేసి చెప్పాడు. కాగా అమన్‌ కుటుంబ సభ్యులు ఈ విషయాన్ని పోలీసులకు చెప్పలేదు.



2014 మేలో అమన్‌తో పాటు కల్యాణ్‌కు చెందిన నలుగురు యువకులు ఐఎస్‌లో చేరడానికి ఇరాక్‌ వెళ్లారు. అప్పటి నుంచి ఐఎస్‌ కార్యకలాపాల్లో పాల్గొంటున్నట్టు భావిస్తున్నారు. గత శనివారం రాత్రి ఓ గుర్తు తెలియని వ్యక్తి అమన్‌ ఇంటికి ఫోన్‌ చేసి.. వైమానికి దాడుల్లో అతను చనిపోయినట్టు చెప్పాడు. ఫోన్‌లో మాట్లాడుతున్నది ఎవరని అమన్‌ తండ్రి ప్రశ్నించగా, గుర్తు తెలియని వ్యక్తి ఫోన్‌ కట్‌ చేశాడు. అమన్‌ బంధువు ఈ విషయాన్ని వెల్లడించాడు. అమన్‌తో పాటు ఐఎస్‌లో చేరిన షహీన్‌ టంకీ అనే యువకుడు కూడా మరణించినట్టు గత జనవరిలో అతని కుటుంబ సభ్యులకు ఫోన్‌ కాల్‌ వచ్చింది. కాగా టంకీ చనిపోయాడా లేదా అన్న విషయం ఇప‍్పటికీ నిర్ధారణ కాలేదు. అమన్‌ మరణవార్తపై మహారాష్ట్ర పోలీసులు మాట్లాడుతూ.. అతని కుటుంబ సభ్యులు ఈ విషయం తమకు చెప్పలేదని, అవసరమైతే విచారణ చేస్తామని చెప్పారు.

 

Read latest State News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top