వరికి మద్దతు ధర పెంపు: ఆదేశాలిచ్చిన జయలలిత


చెన్నై, సాక్షి ప్రతినిధి: అన్నదాతకు తీపికబురు. వరికి మద్దతు ధర పెంచుతూ ముఖ్యమంత్రి జయలలిత నిర్ణయం తీసుకున్నారు. కేంద్రం ధరకు అదనంగా సొమ్ము చెల్లించనున్నారు. రాజకీయాల్లో అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత శైలే వేరు. ఆమె నేతృత్వంలోని అన్నాడీఎంకే ప్రభుత్వం సంక్షేమ పథకాలతో దూసుకెళుతోంది. ముఖ్యంగా ప్రజాకర్షక పథకాలతో జయలలిత నిత్యం వార్తల్లో ఉంటున్నారు. ఈ కోవకే చెందుతాయి. అమ్మ క్యాంటీన్లు, అమ్మ మినరల్ వాటర్, చౌక దుకాణాలు. ఇలా అన్ని వర్గాల ప్రజలను ఆకర్షించే విధంగా జయలలిత పాలన సాగిస్తున్నారు. 

 

తాజాగా ఆమె అన్నదాతకు తీపి కబురు పంపారు. వరిధాన్యం సేకరణలో క్వింటాలుపై కేంద్రం రూ.1310, సన్నరకంపై రూ.1345 చెల్లిస్తోంది. ఈ ధర తమకు ఏ మాత్రమూ సరిపోదని రైతులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి జయలలిత సచివాలయంలో అధికారులతో గురువారం సమావేశమయ్యారు. వరి మద్దతు ధర అంశానికి సంబంధించి చర్చించారు. సాధారణ రకంపై అదనంగా రూ.50, సన్నరకంపై రూ.70 చెల్లించాలని ఆమె నిర్ణయించారు. ఈ లెక్కన సాధారణ రకానికి రూ.1360, సన్నరకానికి రూ.1415 చెల్లించాలని అధికారులను ఆదేశించారు.

 
Read latest State News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top