లైఫ్‌లైన్ కాదది...డెత్ లైన్


ముంబై సెంట్రల్, న్యూస్‌లైన్: ముంబై లైఫ్‌లైన్‌గా భావించే లోకల్ రైళ్లలో రాకపోకలు సాగించేవారిలో  ప్రతి ఏడాది సుమారు మూడు వేల నుంచి నాలుగు వేల మంది మృత్యువాతపడుతున్నారు. దాదాపు అదే సంఖ్యలో గాయపడుతున్నారు. వీటిని నివారించడానికి రైల్వే శాఖ ఎటువంటి చర్యలూ తీసుకోవడం లేదనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.



 ఈ విషయమై ఠాణే జిల్లా రైల్వే ప్రయాణికుల సంఘం అధ్యక్షుడు, బీజేపీ నేషనల్ కౌన్సిల్ సభ్యుడు ఓంప్రకాష్ శర్మ వెల్లడించిన వివరాలిలా ఉన్నాయి. 2002-12 మధ్య కాలంలో జరిగిన ప్రమాదాల్లో సుమారు 39,970 ప్రయాణికులు మరణించారు. ఇంకా 40,526 మంది గాయపడ్డారు. ఇదే కాలంలో పట్టాలు దాటుతూ ప్రమాదానికి గురై 6,153 మంది చనిపోయారు. 1,886 మంది గాయపడ్డారు. అదేవిధంగా నడుస్తున్న రైలు నుంచి ప్రమాదవశాత్తు కిందపడి 2,304 మంది ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయారు. ఇంకా 5,936 మంది గాయపడ్డారు. రైలు, ప్లాట్‌ఫాంల మధ్య చిక్కుకుని 33 మంది చనిపోయారు. 183 మంది గాయపడ్డారు.





 పట్టింపే లేదు: లోకల్ రైళ్లలో ప్రతిరోజూ లక్షల సంఖ్యలో నగరవాసులతోపాటు ఇతర ప్రాంతాలవారు ప్రయాణిస్తారని, అనేకమంది ప్రమాదాల్లో చనిపోతున్నప్పటికీ రైల్వే శాఖ వారికి సహాయం కోసం ఏమీ చేయడం లేదని ఓంప్రకాశ్ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రయాణికుడు చనిపోతే వారి కుటుంబీకులకు పునరావాసం కల్పించే బాధ్యత రైల్వేదేనన్నారు.  రైలు ప్రమాదాల్లో చనిపోతున్న, గాయపడుతున్న వారి సంఖ్య నానాటికీ పెరుగుతుండడంపై  రైల్వే ప్రయాణికుల సంఘం... పలు రాజకీయ పార్టీలను నిలదీయడంతో రైల్వే అధికారులు స్టేషన్లలో అంబులెన్స్ సేవలను ప్రారంభించారన్నారు. వైద్యసేవల బాధ్యతను మాత్రం మరిచిపోయారన్నారు. కాగా సెంట్రల్, హార్బర్, పశ్చిమ రైల్వే మార్గాల్లో ప్రతిరోజూ 80 లక్షల మంది ప్రయాణికులు లోకల్ రైళ్లలో రాకపోకలు సాగిస్తుంటారు. ప్రయాణికుల సంఖ్య పెరుగుతున్నప్పటికీ రైల్వేశాఖ ప్రయాణికులకు తగు వసతులు కల్పించడం లేదన్నారు.

Read latest State News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top