విద్యార్థులను చితకొట్టిన ఐటీఐ ప్రిన్సిపల్ అరెస్ట్
ఠాణే: కళాశాలలో క్రికెట్ ఆడుతున్నారని ఆరుగురు విద్యార్థులను ప్రిన్సిపల్ చితక్కొట్టాడు. ఈ ఘటన శుక్రవారం వాగ్లే ఎస్టేట్ ఏరియాలో ఉన్న రాష్ట్ర ప్రభుత్వ ఐటీఐ కళాశాలలో చోటుచేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. ఆరుగురు విద్యార్థులు ఖాళీ సమయంలో కళాశాల గ్రౌండ్లో క్రికెట్ ఆడుతున్నారు. అంతలో అక్కడికి వచ్చిన ప్రిన్సిపల్ పీజీ భాస్కర్ వారిని క్లాసులకు వెళ్లండని గదమాయించాడు. అంతేకాక చెక్కతో చితకబాదాడు. ఈ మేరకు బాధిత విద్యార్థులు శ్రీనగర్ పోలీసులకు ఫిర్యాదుచేయగా కేసు నమోదు చేసుకుని ప్రిన్సిపల్ను శనివారం అరెస్టు చేసినట్లు ఇన్స్పెక్టర్ ఎస్జే కాకడే తెలిపారు.