హీరోలతో నాకెప్పుడూ గొడవల్లేవు: పవన్
తోటి హీరోలతో తనకు ఎప్పుడూ గొడవలు లేవని.. ఆమాటకొస్తే సినీ పరిశ్రమలో ఎవరూ ఎవరితోనూ గొడవలు పడరని టాలీవుడ్ హీరో పవన్ కల్యాణ్ అన్నారు. కర్ణాటకలోని కోలార్ ప్రాంతంలో ఇద్దరు హీరోల అభిమానుల మధ్య రెండు రోజుల క్రితం జరిగిన ఘర్షణలో కత్తిపోట్లకు గురై మరణించిన వినోద్ రాయల్ కుటుంబాన్ని ఆయన తిరుపతిలో గురువారం పరామర్శించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. హీరోలు ఎప్పుడూ పరస్పరం గొడవ పడరు గానీ, కిందికి వచ్చేసరికి అభిమానులు మాత్రం గొడవ పడతారని చెప్పారు. మరణించిన వినోద్ కుటుంబానికి ఎప్పుడూ అండగా ఉంటానని తెలిపారు. అసలు ఏం జరిగింది, ఎందుకు జరిగిందనే విషయాలను కోలార్ పోలీసు స్టేషన్ నుంచి, అక్కడి వర్గాల నుంచి తెలుసుకుంటానని పవన్ చెప్పారు.
సినీ పరిశ్రమలో అంతా కలిసి మెలిసే ఉంటామని, తమమధ్య పోటీతత్వం ఉంటుంది గానీ అది ఇలాంటి గొడవలకు దారితీయడం విషాదకరమని తెలిపారు. అభిమానం కొంతవరకే ఉండాలని, అది హద్దులు దాటితే విపత్కర పరిణామాలకు దారితీస్తుందని అన్నారు. మితిమీరిన అభిమానం హింసకు దారితీయడం సహించరానిదని ఆయన చెప్పారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకూడదని, చంపుకొనేంత స్థాయికి వెళ్లడం ఎవరికీ మంచిది కాదని హితవు పలికారు. ఈ ఘటనపై విచారణ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైతే అప్పుడు సీబీఐ విచారణ కోరుతామని ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.