గొంతు నులిమి భార్యను చంపిన భర్త!
గౌరిబిదనూరు(కర్ణాటక): భార్యపై అనుమానంతో భర్త గొంతు నులిమి హత్య చేశాడు. అనంతరం తన పిల్లలతో కలిసి పోలీస్ స్టేషన్లో లొంగిపోయాడు. ఈ సంఘటన పట్టణంలోని శ్రీనగర్ కాలనీలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు... ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లా, నంద్యాల పట్టణానికి చెందిన కార్పెంట్ మహబూబ్, షకీరాబాను(28) దంపతులు గౌరీబిదనూరుకు వలస వచ్చారు. వీరికి మూడేళ్ల వయసున్న కుమారుడు, ఏడాదిన్నర వయసున్న కుమార్తె ఉంది. మహబూబ్ బాషా కార్పెంటర్ పనులు చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు.
అయితే భార్యపై అనుమానంతో తరచూ వేధించేవాడు. గతంలో ఓసారి పెద్దలు పంచాయితీ చేసి దంపతులకు సర్ది చెప్పారు. అయినప్పటికీ అతనిలో మార్పు రాలేదు. ఈక్రమంలో ఆదివారం తెల్లవారజామున షకీరాబానును గొంతునులిమి హత్య చేసి అనంతరం పిల్లలతో కలిసి పోలీస్స్టేషన్లో లొంగిపోయాడు. టౌన్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి కేసు దర్యాప్తు చేపట్టారు.