పెళ్లి చేయనందుకు కన్న తల్లిని కడతేర్చాడు
కేకేనగర్: పెళ్లి చేయలేదన్న కోపంతో కన్న తల్లిని కత్తితో గొంతుకోసి, కిరోసిన్ పోసి నిప్పు అంటించి పరారైన కసాయి కుమారుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. చెన్నై అరుంబాక్కం మహంకాళి నగర్ దురైస్వామి వీధికి చెందిన శశికల(60) ప్రైవేటు స్కూల్లో ఆయాగా పనిచేస్తున్నారు. భర్తను పోగొట్టుకున్న శశికలకు ముగ్గురు కుమారులు. అందులో ఒకరు ప్రమాదంలో మరణించాడు. పెద్దకుమారుడు అమర్నాథ్ ప్రసాద్(40) డ్రైవర్గా పనిచేస్తున్నాడు. ఇంకా ఇతడికి పెళ్లి కాలేదు. రెండో కుమారుడు ఆనంద్ పెళ్లి చేసుకుని అదే ప్రాంతంలో భార్యతో వేరు కాపురం పెట్టాడు. అమర్నాథ్ ప్రసాద్ సరిగ్గా పనికి వెళ్లకుండా రోజు తాగి ఇంటికి వచ్చి తనకు పెళ్లి చేయాలని తల్లితో గొడవ పడేవాడు.
శశికళ ఇటీవల కింద పడటంతో నడుం విరిగి మంచాన పడింది. తల్లి మంచాన పడటంతో ఆమెను చూసుకోవడం భారంగా మారింది. అదే సమయంలో తనకు పెళ్లి చేయాలని ఆమెపై ఒత్తిడి పెంచాడు. ఆమెకు సహాయంగా ఉన్న బంధువుల్ని కూడా వేధించేవాడు. ఎప్పట్లాగే ఆదివారం తల్లితో గొడవ పడ్డ అమర్నాథ్ మంచంలో ఉన్న శశికల గొంతు కోశాడు. ఆమె రక్తపుమడుగులో విలవిలలాడింది. అప్పటికీ కోపం చల్లారక ఆమెపై కిరోసిన్ పోసి నిప్పంటించాడు.
ఇంట్లో నుంచి వస్తున్న పొగతో ఇరుగు పొరుగు వారు విషయం గమనించి మంటల్ని ఆర్పి చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. అయితే, అక్కడ చికిత్సలు ఫలించక శశికల సోమవారం ఉదయం మరణించింది. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేశారు. పరారీలో ఉన్న అమర్నాథ్ కోసం తీవ్రంగా గాలిస్తున్నారు.