కొద్దిసేపట్లో వివాహం.. అంతలోనే విషాదం


సాక్షి, ముంబై: విధి ఎంత చిత్రమైనదో... ఇంకాసేపట్లో పెళ్లి పీటల మీద కూర్చోవాల్సిన పెళ్లి కొడుకు పాడె ఎక్కాల్సి వచ్చింది. ఈ విషాద సంఘటన మహారాష్ట్రలోని సాంగ్లీ జిల్లా మీరజ్‌లో శనివారం జరిగింది. కొల్హాపూర్‌కు చెందిన భూషణ్‌, కుడాల్కర్‌ దంపతుల కూతురు వృషాలికి మీరజ్‌ వాసి రవీంద్ర పిసేతో శనివారం వివాహం​ జరగాల్సి ఉంది. వధూవరులు శుక్రవారం హలదీ (పెళ్లికి ఒకరోజు ముందు జరిగే కార్యక్రమం)ని ఎంతో ఘనంగా ముగించారు. మీరజ్‌లోని టాకలీ రోడ్డుపై ఉన్న షాహి దర్బార్‌ హాల్‌లో శనివారం ఉదయం 11.45 గంటలకు వివాహం జరగాల్సి ఉంది. పెళ్లి వారంతా షాహి దర్బార్‌కు బయలుదేరారు.



పెళ్లి కొడుకు రవీంద్ర 8.30 గంటల ప్రాంతంలో మిత్రులు, కుటుంబీకులతో ఫంక్షన్‌ హాల్‌కు బయలుదేరాడు. కొద్ది క్షణాల్లో చేరుకుంటారనగా రవీంద్రకు ఒక్కసారిగా ఛాతీలో నొప్పి వచ్చింది. అందరూ చూస్తుండగానే దారిలోనే కుప్పకూలిపోయాడు. వెంటనే ఆసుపత్రికి తరలించినప్పటికీ ఫలితం దక్కలేదు. రవీంద్ర మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. దీంతో వరుడి కుటుంబీకులు, పెళ్లి మండపం వద్ద వరుడి కోసం ఎదురు చూస్తున్న వధువు కుటుంబీకులు, బంధువులు ఈ వార్త విని ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. అప్పటివరకు ఎంతో సందడిగా ఉన్న ఆ హాల్‌లో ఒక్కసారిగా నిశ్శబ్దం చోటుచేసుకుంది.

Read latest State News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top