నేడే ఉప పోరు


  •   సర్వం సిద్ధం చేసిన అధికారులు

  •   పోలింగ్‌కు బూత్‌లకు ఈవీఎంలు

  •   ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు పోలింగ్

  •   భారీగా పోలీస్ బందోబస్తు

  • సాక్షి, బళ్లారి : బళ్లారి గ్రామీణ ఉప ఎన్నికల పోలింగ్ గురువారం జరుగనుంది. ఓటరు దేవుడు ఏ పార్టీ వైపు మొగ్గు చూపుతాడోనని బీజేపీ, కాంగ్రెస్ నేతలు ఉత్కంఠంగా ఎదురు చూస్తున్నారు. బీజేపీ అభ్యర్థిగా ఓబులేసు, కాంగ్రెస్ అభ్యర్థిగా ఎన్‌వై. గోపాలకృష్ణ బరిలో ఉన్నారు. వీరు నామినేషన్లు సమర్పించినప్పటి నుంచి బళ్లారిలో ప్రచారం హోరెత్తింది. రెండు పార్టీలకు చెందిన అతిరథ మహారథులు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. కాంగ్రెస్ తరుఫున సీఎం సిద్ధరామయ్య రెండుసార్లు బళ్లారిలో ప్రచారం చేశారు.



    ఇక యావత్ మంత్రులు, ఎమ్మెల్యేలు ఇంటింటా ప్రచారం చేశారు. వారికి ధీటుగా బీజేపీ నేతలు కూడా కేంద్ర మంత్రులు అనంత్‌కుమార్, సదానందగౌడ, మాజీ ముఖ్యమంత్రులు యడ్యూరప్ప, జగదీష్ శెట్టర్, మాజీ ఉప ముఖ్యమంత్రి కేఎస్ ఈశ్వరప్ప, ఎంపీ శ్రీరాములు, కేఎంఎఫ్ అధ్యక్షుడు గాలి సోమశేఖరరెడ్డి విస్తృతంగా ప్రచారంలో పాల్గొన్నారు. మొత్తం మీద బహిరంగ, చివరి రోజు ఇంటింటా ప్రచారం ముగిసింది. గురువారం  ప్రజలు తమ తీర్పును ఇవ్వబోతున్నారు.

     

    ‘బళ్లారి’లో 1,88,307 మంది ఓటర్లు..

     

    బళ్లారి గ్రామీణ ఉప ఎన్నికల్లో 1,88,307 మంది ఓటర్లు ఉన్నారు. వారిలో 94,665 మంది మహిళలు, 93,619 మంది పురుషులు, 23 మంది ఇతరులు ఉన్నారు. మొత్తం 203 పోలింగ్ బూత్‌లను ఏర్పాటు చేశారు. గురువారం ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు పోలింగ్‌ను నిర్వహిస్తారు.



    జిల్లా యంత్రాంగం ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా గట్టి పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేసింది. స్థానిక ప్రభుత్వం పాలిటెక్నిక్ కళాశాల వద్ద పోలింగ్ బూత్‌ల వారీగా సిబ్బంది నియామకం, అందుకు అవసరమైన ఈవీఎంల అప్పగింత, భద్రతా సిబ్బంది, వాహనాల కేటాయింపు ప్రక్రియ ఉదయం నుంచి ఆరంభమైంది. సిబ్బందిని, ఈవీఎం బాక్సులను తరలించడానికి  కేఎస్‌ఆర్‌టీసీ బస్సులను కళాశాల ముందు బారులు తీరాయి. బుధవారం ఉదయం ఆరు గంటల నుంచే ఎన్నికల పోలింగ్ సందడి మొదలైంది. మధ్యాహ్నానికల్లా సిబ్బంది పోలింగ్ కేంద్రాలకు చేరుకొన్నారు.

     

Read latest State News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top