అప్పుల బాధతో రైతు ఆత్మహత్య
కారేపల్లి: ఖమ్మం జిల్లా కారేపల్లి మండలంలో ఓ రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. కారేపల్లి మండలం భాగ్యనగర్ తండాలో వాంకుడోతు రాములు(48) మంగళవారం ఉదయం పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈయనకు భార్య, ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. పెద్ద కుమార్తెకు వివాహం చేయడంతో కొంత అప్పు అయింది. 8 ఎకరాల పొలం కౌలుకు తీసుకుని అందులో 6 ఎకరాల్లో పత్తి, రెండెకరాల్లో మిర్చి సాగు చేస్తున్నాడు.
నకిలీ విత్తనాలతో మిర్చి పంట ఆశాజనకంగా లేదు. దీంతో కుమార్తె పెళ్లి, పంటలు పండకపోవడంతో మూడేళ్లుగా రూ.5 లక్షల వరకు అప్పు అయింది. అప్పు తీర్చలేక తీవ్ర మనస్థాపానికి గురయ్యాడు. రెండు రోజులు నుంచి ఆహారం కూడా తీసుకోవడంలేదని కుటుంబీకులు చెబుతున్నారు. మంగళవారం ఉదయం ఆత్మహత్య చేసుకోవడంతో ఆ కుటుంబంలో విషాదం అలుముకుంది.