పోలీసుల వేధింపులు: రైతు ఆత్మహత్యాయత్నం
ఆలూరు: పోలీసులు, దేవాదాయ శాఖ అధికారుల తీరుతో మనస్తాపం చెందిన ఓ రైతు ఆత్మహత్యకు యత్నించాడు. కర్నూలు జిల్లా హళహర్వి మండలం పుర్లెహళ్లి గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన శంభులింగం వ్యవసాయ దారుడు. ఈయన ఏళ్లుగా కొంత భూమిని సాగు చేసుకుంటున్నాడు. అయితే, ఆ భూమి దేవాదాయ శాఖకు చెందినదంటూ అధికారులు నోటీసులు పంపారు.
దీంతోపాటు పోలీసులు కూడా ప్రభుత్వ భూమిలో సాగు చేయరాదంటూ ఆయనపై ఒత్తిడి తెచ్చారు. ఈ నేపథ్యంలో తీవ్ర మనస్తాపానికి గురైన శంభులింగం తెల్లవారు జామున ఇంట్లోనే పురుగుమందు తాగాడు. గమనించిన కుటుంబసభ్యులు ఆయన్ను వెంటనే ఆలూరు ఆస్పత్రికి తరలించారు. ఆయనకు ప్రాణాపాయం తప్పిందని వైద్యులు తెలిపారు. అయితే అధికార యంత్రాంగం ఒత్తిళ్ల వెనుక టీడీపీ నేతలు ఉన్నారని ఆయన కుటుంబసభ్యులు ఆనుమానిస్తున్నారు.