‘ఒక చేత్తో ఇస్తూ.. మరో చేత్తో లాక్కుంటున్నారు’
కందుకూరు: రాష్ట్ర సర్కారు ఒక చేత్తో ఇచ్చినట్లు చేస్తూ మరొక చేత్తో లాక్కుంటోందని మాజీ హోంమంత్రి సబితా ఇందిరారెడ్డి ధ్వజమెత్తారు. సమగ్ర సర్వే ద్వారా వివరాలన్నీ తెలుసుకుని... పేదలకు అందాల్సిన పథకాలను తొలగిస్తున్నారని ఆమె సీఎంపై మండిపడ్డారు. రైతులకు ఏక కాలంలో రుణమాఫీ చేయాలని, విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ నిధులు విడుదల చేయాలని కోరుతూ కాంగ్రెస్ ఆధ్వర్యంలో శనివారం మండలంలో రైతులు, విద్యార్థుల నుంచి సంతకాలను సేకరించారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న సబిత.. ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. మ్యానిఫెస్టోనే భగవద్గీతని చెప్పే సీఎం, ఇచ్చిన హామీలన్నీ అమలు చేయకపోవడంపై ఏం మాట్లాడుతారని ప్రశ్నించారు. రైతులు తమ పేరుతో ఉన్న అప్పుల వివరాలు రాసి సంతకం చేసి ఇస్తే ఆ ప్రతులను గవర్నర్తో పాటు రాష్ట్రపతికి అందించి సమస్యల పరిష్కారం కోసం పోరాటం చేసి కేసీఆర్ మెడలు వంచుతామన్నారు.