దీపావళి వెలుగులు
సాక్షి, బెంగళూరు: అమావాస్య చీకట్లను చీలుస్తూ వెలుగులను వెదజల్లే దివ్వెల పండుగ దీపావళిని అంగరంగ వైభవంగా జరుపుకునేందుకు రాష్ట్రంతో పాటు ఉద్యాననగరి వాసులు సన్నద్ధమయ్యారు. అల్లరి చేసే చిచ్చుబుడ్లు, భయపెట్టే బాంబులు, కాంతులు విరజిమ్మే కాకరపూలు వీటన్నింటి సమాహారంగా తమ జీవితంలో ఓ తీపి జ్ఞాపకంగా దీపావళిని జరుపుకునేందుకు తమ పిల్లలతో కలిసి షాపింగ్ చేశారు.
ఇక దీపావళి సందర్భంగా విభిన్న రూపాల్లో తయారైన దివ్వెలకు భారీగా డిమాండ్ ఏర్పడింది. ఇక దీపావళికి ఒక రోజు ముందు నిర్వహించే నరక చతుర్ధశిని సైతం మెట్రోవాసులు ఘనంగా జరుపుకున్నారు. బాణసంచా కాలుస్తూ దీపావళికి ఆహ్వానం పలికారు. సంతోషదాయకమైన, సురక్షితమైన దీపావళిని జరుపుకోవడంపై ఇప్పటికే అనేక స్వచ్ఛంద సంస్థలు నగర వాసుల్లో అవగాహనను కల్పించేందకు వివిధ కార్యక్రమాలను నిర్వహించిన విషయం తెలిసిందే.