'సిగ్గులేకుండా చెబుతోంది'
ముంబై: బీజేపీ ఎంపీ, బాలీవుడ్ నటి హేమమాలినికి మహారాష్ట్ర ప్రభుత్వం తక్కువ ధరకు స్థలం ఇవ్వడంపై ఎన్సీపీ నేత, శాసన మండలిలో ప్రతిపక్షనేత ధనంజయ్ ముండే తీవ్రంగా స్పందించారు. బాంబే హైకోర్టు నిబంధనలను ప్రభుత్వం పాటించడంలేదని ఆరోపించారు. సరైన వేలం పాట లేకుండా ప్రభుత్వ భూములను ఇవ్వకూడదని బాంబే హైకోర్టు 2011 చెప్పిందని గుర్తు చేశారు. ప్రభుత్వమేమో చట్ట ప్రకారమే స్థలం ఇచ్చామని సిగ్గులేకుండా చెబుతోందని విమర్శించారు.
లాథూర్ జిల్లాలోని పట్టణాల్లో నీటి సరఫరా లేక ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారని ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చారు. లాథూర్లోని పట్టణాలకు 20 రోజులుగా నీళ్లు రావడం లేదని, బీడ్లో నీటి సరఫరా నిలిచిపోయి 15 రోజులైందని తెలిపారు. ప్రజలకు తాగునీరు అందించడానికి దయచేసి ఏదోఒకటి చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. థానేలో ‘మేక్ ఇన్ ఇండియా వీక్’ ను ప్రారంభించనున్న ప్రధాని మోదీ రాష్ట్రంలోని రైతుల ఆత్మహత్యల గురించి కూడా ప్రపంచ దేశాల అధినేతలకు తెలపాలని ధనంజయ్ అన్నారు.