‘ద్వారకా’ ఎవరికి దక్కేనో?
సాక్షి, న్యూఢిల్లీ: ద్వారకా నియోజకవర్గ ఎన్నికల పోరు ఆసక్తికరంగా మారింది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ స్వయంగా ఈ నియోజక వర్గంలో జరిగే ఎన్నికల ర్యాలీలో పాల్గొననున్నారు. దీనినిబట్టే ఈ నియోజక వర్గానికి ఎంత ప్రాధాన్యముందనే విషయాన్ని అవలీలగా అవగతం చేసుకోవచ్చు. ద్వారకాలో పోరు ఆసక్తికరంగా మారడానికి ప్రధాన కారణం ఆమ్ ఆద్మీ పార్టీ నిలబెట్టిన అభ్యర్థి దివంగత మాజీ ప్రధానమంత్రి లాల్ బహదుర్శాస్త్రి మనువడైన ఆదర్శ్శాస్త్రి. యాపిల్ కంపెనీలో రూ. కోట్ల రూపాయల ఉద్యోగానికి రాజీనామా చేసి రాజకీయాలలో చేరిన ఆదర్శ్ శాస్త్రిని... ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) తన అభ్యర్థిగా ప్రకటించింది.
పెద్దల వద్ద ఒకవైపు తనను తాను లాల్ బహదుర్శాస్త్రి మనువడిగా వినమ్రంగా పరిచయం చేసుకుంటూ, యాపిల్ ఉద్యోగిగా మరోవైపు యువతను పరిచయం చేసుకుంటూ ఆప్ అభ్యర్థి ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఆ పార్టీ ప్రకటించిన ఉచిత వైఫై, మహిళా భద్రత యాప్ శాస్త్రి...ప్రచారంలో ప్రధానాంశాలుగా ఉన్నాయి.కాంగ్రెస్ పార్టీ ఇక్కడ నుంచి మాజీ ఎంపీ మహాబల్ మిశ్రాను తన అభ్యర్థిగా నిలబెట్టింది. గత ఎన్నికలలో ఇక్కడ నుంచి మహాబల్ మిశ్రా తనయుడు వినయ్మిశ్రా కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీచేసి ఓడిపోయారు. గత ఎన్నికలలో ఇక్కడ నుంచి గెలిచిన ప్రద్యుమ్న రాజ్పుత్కే బీజేపీ...ఈసారి టికెట్ ఇచ్చింది. రాజ్పుత్... 2008లోనూ ఇక్కడి నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.