నీటి సమస్యకు సింగపూర్ మంత్రం


 న్యూఢిల్లీ: దేశ రాజధాని ప్రజల నీటి కష్టాలను తీర్చడానికి ఢిల్లీ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా వృథా నీటిని తిరిగి వాడుకునే విధానం అవలంభిస్తున్న సింగపూర్‌ను ఆదర్శంగా తీసుకోనుంది. వృథా నీటిని శుద్ధి చేసి తిరిగి ఉపయోగించే పద్ధతులను అధ్యయన ం చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు ముఖ్యమంత్రి కేజ్రీవాల్ సోమవారం తెలిపారు. రాష్ట్రపతి భవన్‌లో సోమవారం జరిగిన పద్మ అవార్డుల ప్రదానోత్సవానికి  కేజ్రీవాల్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడతూ వృథా నీటిని తిరిగి ఉపయోగించడంలో సింగపూర్ అనుసరిస్తున్న విధానాలను అధ్యయనం చేయడానికి కొన్ని బృందాలను పంపినట్టు తెలిపారు. ‘సింగపూర్‌కు స్వతహాగా నీటి వసతి లేదు. ఆ దేశానికి 95 శాతం నీరు బయటి నుంచే వస్తుంది.

 

  ఆ నీటిని శుద్ధి చేసి తిరిగి ఉపయోగించే నూతన పద్ధతులకు సింగపూర్ శ్రీకారం చుట్టింది. దీని వల్ల బాత్‌రూం, వంటగదిలో ఉపయోగించే నీరు తిరిగి అక్కడే ఉపయోగించొచ్చు. ఈ విధంగా ఎక్కడ వాడుకున్న నీటిని అక్కడే వినియోగించేలా సింగపూర్ పద్ధతిని పరిశీలిస్తున్నాం. దీనిని పెలైట్ ప్రాజెక్టుగా తీసుకుని ఢిల్లీలో 10 నుంచి 15 ప్లాంట్లు ఏర్పాటు చేయాలనే ఆలోచనలో ఉన్నాం. ఈ పద్ధతిలో వ్యర్థ నీటిని శుద్ధి చేసిన ప్పుడు అది పూర్తిగా మంచి నీటిలాగే మారుతుంది. మా ప్రయత్నాలు ఫలిస్తే ఢిల్లీలో నీటి సమస్య అసలు ఉండదు’ అని కేజ్రీవాల్ పేర్కొన్నారు. అలాగే ఢిల్లీలో ఇప్పటికీ కేవలం 30 నుంచి 40 శాతం మంది మాత్రమే ఆస్తి పన్ను చెల్లిస్తున్నట్టు తన దృష్టికి వచ్చిందని కేజ్రీవాల్ చెప్పారు.  ఆస్తి పన్ను చెల్లింపులను రాబట్టడం గురించి కూడా యోచిస్తున్నామన్నారు.

 

Read latest State News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top