రెండేళ్లుగా గాడిదలు కాస్తున్నావా బాబూ?
సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ధ్వజం
చెన్నై, సాక్షి ప్రతినిధి: కాపు ఐక్య గర్జన సందర్భంగా చోటుచేసుకున్న అవాంఛనీయ సంఘటనలకు తెలుగుదేశం పార్టీదే పూర్తి బాధ్యత అని, ప్రథమ ముద్దాయి చంద్రబాబేనని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ విమర్శించారు. చెన్నైలోని సీపీఐ పార్టీ కార్యాలయంలో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి రెండేళ్లయినా కాపు రిజర్వేషన్లపై నిర్ణయం తీసుకోకుండా గాడిదలు కాస్తున్నావా చంద్రబాబూ అని మండిపడ్డారు.
రైలు తగలబడితేగానీ బాబుకు పరిస్థితి తీవ్రత అర్థం కాలేదా..?అని ఎద్దేవా చేశారు. ముద్రగడ పద్మనాభం ఆమరణ దీక్ష వహించడం సమర్థనీయమేనని, అయితే భార్యాబిడ్డలను సైతం దీక్షకు పురిగొల్పడం గృహహింస నిరోధక చట్టం కిందకు వస్తుందని వ్యాఖ్యానించారు. చంద్రబాబు పాలిట నటుడు పవన్ కల్యాణ్ ఒక శిఖండిలా దాపురించాడని మండిపడ్డారు. రాజకీయ ఇబ్బందులు తలెత్తినప్పుడల్లా చంద్రబాబును బైటపడేసేందుకు పవన్ కల్యాణ్ పాటుపడుతున్నాడని ఆరోపించారు.