రేప్ అంటూ... తప్పుడు కేసు
న్యూఢిల్లీ: నేరం చేయకున్నా ముగ్గురు వ్యక్తులపై తప్పుడు లైంగికదాడి కేసు పెట్టిన ఓ మహిళపై ఢిల్లీ కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. చేయని తప్పుకు నిందితులను అవమానానికి గురిచేసిందని, పోలీసులకు తప్పుడు సమాచారం ఇచ్చి విచారణ పేరుతో కోర్టు సమయాన్ని వృథా చేసిందని వ్యాఖ్యానించింది. నిందితురాలిపై క్రిమినల్ కేసు నమోదు చేయాల్సిందిగా ఆదేశించింది.
2014 మేలో ముగ్గురు వ్యక్తులు తనపై అఘాయిత్యానికి పాల్పడినట్టు ఓ వివాహిత హరినగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. తన భర్త, అత్తకు చెందిన 1.20 లక్షల విలువ చేసే నగలను దోచుకెళ్లారని ఫిర్యాదులో పేర్కొంది. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. కాగా ఆమెపై లైంగికదాడి జరగలేదని, తప్పుడు కేసు పెట్టినట్టు కోర్టు విచారణలో రుజువైంది. ముగ్గురు నిందితుల్లో ఒకరితో వివాహేతర సంబంధం ఉన్నట్టు ఆమె అంగీకరించింది. మిగిలిన ఇద్దరూ అతని స్నేహితులను చెప్పింది. ఈ విషయం తన భర్తకు తెలియడంతో కేసు పెట్టాల్సిందిగా తనకు చెప్పాడని తెలిపింది.
తప్పుడు కేసు పెట్టిన మహిళపై క్రిమినల్ కేసు నమోదు చేసి చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ ముందు హాజరుపరచాల్సిందిగా అడిషనల్ సెషన్స్ జడ్జి షాయిల్ జైన్ ఆదేశించారు. ఈ కేసులో ప్రమేయం లేకపోవడంతో నిందితుల వాంగ్మూలాన్ని కోర్టు నమోదు చేయలేదు. ఆమె పోలీసులకు తప్పుడు సమాచారం ఇచ్చి నిందితులకు కష్టాలుపెట్టిందని, ఈ కేసు విచారణ వల్ల కోర్టు సమయాన్ని వృథా చేసిందని జైన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.