కొడుకు మృతిని జీర్ణించుకోలేక...
మండ్య : అల్లారుముద్దుగా పెంచుకుంటున్న కొడుకు అనారోగ్యంతో మృతి చెందడంతో మనస్థాపం చెందిన దంపతులు మైసూరు సమీపంలోని విశ్వేశ్వరయ్య కాలువలో దూకి ఆత్మహత్య చేసుకున్నారు. వివరాల్లోకి వెళితే... మైసూరు సమీపంలోని హినకల్ గ్రామానికి చెందిన దేవయ్య(44), విజయలక్ష్మి(44) దంపతులు. వేప్ పెరిఫరల్ సంస్థలో సెక్యూరిటీ సూపర్ వైజర్గా దేవయ్య, అదే గ్రామంలోని విజయ పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా విజయలక్ష్మి పనిచేస్తున్నారు. వీరికి చందన్(10) అనే కుమారుడు ఉన్నాడు.
ఐదేళ్ల క్రితం క్యాన్సర్తో బాధపడుతూ చందన్ మృతి చెందాడు. అప్పటి నుంచి వీరికి మరో సంతానం కలుగలేదు. ఈ నెల 27న చందన్ పుట్టిన రోజు ఉంది. వారం రోజుల క్రితం బంధువులకు ఫోన్ చేసి 27న చందన్ పుట్టిన రోజు వేడుక చేస్తున్నామని తెలిపారు. కొడుకు మృతిని అనుక్షణం తలచుకుంటూ పరితపిస్తున్న దంపతులు వేదనను భరించలేక మంగళవారం ఉదయం సుజిక్ బైక్పై కేఆర్ఎస్కు చేరుకున్నారు. అనంతరం చున్నీతో ఇద్దరూ కట్టుకుని కాలువలో దూకి ఆత్మహత్య చేసుకున్నారు.
అంతకు ముందు వారు రాసి పెట్టిన ఉత్తరాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మృతురాలి అన్న రమేష్ ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఉత్తరంలో కొడుకు లేని జీవితం తమకు వద్దని పేర్కొన్నారని, ప్రతి క్షణం తమకు కొడుకు జ్ఞాపకం వస్తున్నాడని పేర్కొన్నట్లు పోలీసులు తెలిపారు.