అవమాన భారంతో దంపతుల ఆత్మహత్య
హనుమంతపాడు: ప్రకాశం జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ఆర్థిక ఇబ్బందులకు తోడు అవమాన భారంతో దంపతులు ఆత్మహత్య చేసుకున్న సంఘటన జిల్లాలోని హనుమంతపాడు మండలం కోటగుంట్లలో గురువారం ఉదయం వెలుగు చూసింది. జిల్లాలోని ఉలవపాడు మండలం మన్నేటికోట గ్రామానికి చెందిన కత్తి ఏడుకొండలు(35), మల్లేశ్వరి(31) దంపతులు కోటగుంట్లలోని బొగ్గుబట్టిలో పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఈ క్రమంలో ఏడుకొండలు బొగ్గుబట్టి యజమానికి డబ్బు బాకి పడటంతో.. అతను గత కొన్ని రోజులుగా ఇబ్బందులకు గురిచేస్తున్నాడు.
రెండు రోజుల క్రితం బొగ్గుబట్టిలో పని చేస్తున్న తన బంధవులందరి ముందు ఏడుకొండలును తీవ్రంగా కొట్టిన యజమాని.. డబ్బు చెల్లించకపోతే చంపేస్తానని బెదిరించాడు. దీంతో మనస్తాపానికి గురైన దంపతులు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. వీరికి ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు.