అంతా టీఆర్ఎస్ నేతల అత్యుత్సాహం: మల్లురవి
హైదరాబాద్: నల్లగొండ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డిపై పోలీసులు, టీఆర్ఎస్ నేతలు చేసిన దాడిని ఖండిస్తున్నామని టీపీసీసీ ఉపాధ్యక్షుడు, నల్లగొండ జిల్లా కాంగ్రెస్ ఇన్చార్జ్ మల్లురవి అన్నారు. ఆయన ఈ రోజు విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. స్థానిక ఎమ్మెల్యే కోమటిరెడ్డికి ప్రోటోకాల్లో చోటివ్వకపోవడం సిగ్గుచేటన్నారు. ఆయన అసెంబ్లీలో నిరంతరం చేసిన పోరాట ఫలితమే నిన్నటి బత్తాయి మార్కెట్ అని.. అలాంటిది ఆయననే మరచిపోయారన్నారు. నిన్నటి ఘటన పూర్తిగా టీఆర్ఎస్ నేతల అత్యుత్సాహం, పోలీసుల వైఫల్యం వల్లే జరిగిందని మండిపడ్డారు.
అదుపు చేసే బదులు అరెస్టులకి మాత్రమే పోలీసులు పరిమితమవుతున్నారన్నారు. టీఆర్ఎస్ సర్కార్ చెప్పుచేతుల్లో పోలీసుల రాజ్యం నడుస్తోందని.. రాష్ట్రంలో పోలీసుల వైఫల్యాలకి నైతిక బాధ్యత వహిస్తూ హోంమంత్రి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. స్థానిక మంత్రి జగదీష్ రెడ్డికి ప్రజాస్వామ్యం పై అవగాహన లేదని.. కోమటిరెడ్డితో పాటు కాంగ్రెస్ నేతలపై పెట్టిన కేసులను తక్షణమే ఎత్తివేయాలన్నారు.