తరలిన ‘విదర్భ’ నిధులు: సీఎం
నాగపూర్: విదర్భ ప్రాంత అభివృద్ధి కోసం కేటాయించిన నిధులను గత ప్రభుత్వం ఇతర ప్రాంతాలకు తరలించేసిందని సీఎం దేవేంద్ర ఫడ్నవిస్ తెలిపారు. ఆయన శుక్రవారం అసెంబ్లీలో మాట్లాడుతూ... విదర్భ ప్రాంత అభివృద్ధి కోసం కేటాయించిన సుమారు రూ. 6 వేల కోట్లను గత డీఎఫ్ ప్రభుత్వం సక్రమంగా ఖర్చు చేయకపోవడంతో ఆ ప్రాంతంలో అభివృద్ధి కుంటుపడిందని తెలిపారు. ఆ నిధులను రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల అభివృద్ధికి తరలించడంతో విదర్భలో అభివృద్ధిపై అది తీవ్రప్రభావం చూపిందని ఆయన విమర్శించారు. 1960లో విదర్భ ప్రాంతం మహారాష్ర్టలో భాగం కాకపోయి ఉంటే ముంబై నగరం ఇప్పుడు గుజరాత్లో కలిసి ఉండేదని ఆయన వ్యాఖ్యానించారు.
విదర్భ ప్రాంతంలోని అమరావతి డివిజన్లో ఇప్పటికీ తహశీల్దార్లు, డిప్యూటీ కలెక్టర్లు, అదనపు కలెక్టర్ల పోస్టులు ఖాళీగానే ఉన్నాయని తెలిపారు. దీనివల్ల నీటిపారుదల ప్రాజెక్టుల కోసం భూసేకరణ ప్రక్రియ చేపట్టడం ఆలస్యమైందన్నారు. ప్రస్తుతం తమ ప్రభుత్వం ఈ పోస్టులను భర్తీచేసిందని, త్వరలోనే నీటిపారుదల ప్రాజెక్టులకు మోక్షం లభిస్తుందని వివరించారు.
అకోలా, వాషిం, బుల్దానా జిల్లాల్లో 102 నీటిపారుదల ప్రాజెక్టుల పనులు వచ్చే ఏడాది జూన్ వరకు పూర్తి చేసి సుమారు 2.36 హెక్టార్ల భూమికి సాగునీరు అందించనున్నట్లు సీఎం వివరించారు. 50 శాతానికిపైగా పనులు పూర్తయిన ప్రాజెక్టులకు నిధుల కేటాయింపులో మొదటి ప్రాధాన్యత ఇస్తామన్నారు. గోసిక్హర్డ్ నీటిపారుదల ప్రాజెక్టు పనులు ముమ్మరంగా సాగుతున్నాయని, 2015 మార్చి కల్లా కొన్ని గ్రామాలకు పునరావాస కేంద్రాల పనులు పూర్తవుతాయని ప్రకటించారు.
ప్రైవేట్ సెక్టార్కు రెండు నౌకాశ్రయాలు
రాష్ట్రంలో రెండు నౌకాశ్రయాల అభివృద్ధి పనులను రెండు ప్రైవేట్ సంస్థలకు అప్పగించనున్నట్లు సీఎం ఫడ్నవిస్ ప్రకటించారు. కొంకణ్ తీర ప్రాంతంలో ఉన్న డిఘి, జయ్ఘర్ ఓడరేవులను అభివృద్ధి నిమిత్తం ప్రైవేట్ సంస్థలకు అప్పజెప్పనున్నట్లు తెలిపారు. అలాగే రాయ్గఢ్ వద్ద కరంజా నౌకాశ్రయం అభివృద్ధి పనులను మరో రెండు, మూడేళ్లలో పూర్తచేయనున్నట్లు వివరించారు. అలాగే నవీముంబైలోని పోర్టుల అభివృద్ధిపై కూడా ప్రభుత్వం దృష్టిపెట్టిందని తెలిపారు. త్వరలోనే రాష్ట్రంలోని జైళ్ల భవనాల ఆధునికీకరణ పనులు చేపట్టనున్నట్లు ప్రకటించారు. అలాగే నివాస ప్రాంతాల మధ్య ఉన్న సెంట్రల్ జైళ్లను నగర శివారు ప్రాంతాలకు తరలించనున్నట్లు తెలిపారు. వీటికోసం స్థల సేకరణ పనులు ఇప్పటికే ప్రారంభమయ్యాయని వివరించారు.