తండ్రిని బలిగొన్న కళాశాల గొడవలు


► తోటి విద్యార్థి తండ్రిని హత్య చేసిన స్నేహితులు


హొసూరు: కళాశాల విద్యార్థుల మధ్య ఏర్పడిన గొడవలు ఓ విద్యార్థి తండ్రిని బలితీసుకున్నాయి. కళాశాలలో ఏర్పడిన గొడవల కారణంగా తోటి విద్యార్థిపై వేటకొడవలితో దాడి చేస్తుండగా అతని తండ్రి అడ్డువచ్చాడు. దీంతో ఆయన్ను  దారుణంగా హత్య చేశారు కిరాతకులు. ఈ సంఘటన రాయకోట పోలీస్‌స్టేషన్‌ పరిధిలో మంగళవారం చోటు చేసుకొంది. రాయకోటకు చెందిన గోవిందరాజ్‌(50) చిల్లర దుకాణం నిర్వహిస్తూ జీవనం సాగించేవాడు. ఇతని కొడుకు గణేష్‌గుప్త(19)  హొసూరు సమీపంలోని పాలిటెక్నిక్‌ కళాశాలలో డీసీఏ చదువుతున్నాడు.


కళాశాలలో గణేష్‌గుప్తకు తోటి విద్యార్థుల మధ్య కక్షలు ఏర్పడ్డాయి. దీంతో ఆ విద్యార్థులు గణేష్‌గుప్తను హత్య చేసేందుకు పథకం వేసుకొని మంగళవారం రాయకోటలోని గణేష్‌గుప్త ఇంటికి వెళ్లి వేటకొడవలితో దాడిచేశారు. అతని తండ్రి గోవిందరాజ్‌ అడ్డురావడంతో దారుణంగా నరికి చంపారు. అంతటితో ఆగక గణేష్‌గుప్తనూ హత్య చేసేందుకు ప్రయత్నించగా అతను తప్పించుకున్నాడు. ఈ దాడిలో గణేష్‌గుప్తతోపాటు   మరోవర్గానికి చెందిన రాజేష్‌ అనే విద్యార్థి తీవ్రంగా గాయపడ్డారు.


బాధితుల కేకలు విన్న స్థానికులు అక్కడికి చేరుకొనే లోపు మరో ఇద్దరు పరారయ్యారు. రాయకోట పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని గోవిందరాజు మృతదేహాన్ని శవపరీక్ష కోసం ఆస్పత్రికి తరలించారు. తీవ్రంగా గాయపడిన గణేష్‌గుప్త, రాజేష్‌లను క్రిష్ణగిరి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ సంఘటన రాయకోట ప్రాంతంలో తీవ్ర సంచలనం సృష్టించింది. రాయకోట పోలీసులు కేసు నమోదు చేసుకొని పరారీలో ఉన్న ఇద్దరు విద్యార్థుల కోసం తీవ్రంగా గాలిస్తున్నారు.

Read latest State News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top