సౌదీలో చిత్తూరు జిల్లా వాసి ఆత్మహత్య
మదనపల్లి: పొట్టకూటి కోసం విదేశాలకు వెళ్లిన ఓ మహిళ...అక్కడ పెట్టే చిత్రహింసలను తట్టుకోలేక ఆత్మహత్యకు పాల్పడింది. చిత్తూరు జిల్లా మదనపల్లి మండలం నీరుగుట్టవారిపల్లికి చెందిన రామిశెట్టి మంజునాథ, హేమలత(29) దంపతులకు పదేళ్లలోపు ఇద్దరు పిల్లలున్నారు. చేనేత కార్మికులుగా వారికి చాలీచాలని కూలి లభిస్తుండటంతో మరింత మెరుగైన జీవనోపాధి కోసం హేమలత ఈ ఏడాది ఏప్రిల్ లో సౌదీ అరేబియా వెళ్లింది. అక్కడ రియాద్ నగరంలో ఓ ఇంట్లో పనికి కుదిరింది. అయితే, ఆ ఇంటి యజమాని ఆమెను చిత్రహింసలు పెట్టేవాడు. వాటిని తట్టుకోలేక ఆమె తరచూ ఇంటికి ఫోన్ చేసి భర్తతో తన గోడు వెళ్లబోసుకునేది. అక్కడ యజమాని ప్రత్యక్ష నరకం చూపుతున్నాడని వాపోయేది.
తిరిగి స్వదేశం చేరాలనుకున్నా.. ఆమెను అక్కడికి తీసుకెళ్లిన ఏజెంట్ మోసం చేశాడు. ఈ నేపథ్యంలోనే గురువారం తను ఉండే చోటే ఉరి వేసుకుని తనువు చాలించింది. ఇదిలా ఉండగా, ఆమె మృతదేహాన్ని స్వదేశానికి తరలించాలంటే కనీసం రూ.1.50 లక్షలు చెల్లించాల్సి ఉంటుందని అక్కడి నుంచి కుటుంబసభ్యులకు సమాచారం అందింది. ఒకవేళ డబ్బులు చెల్లించినా మృతదేహం స్వదేశం చేరుకునేందుకు కనీసం మూడు నెలలు పడుతుందని వారు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఏం చేయాలో పాలుపోక భర్త, కుటుంబసభ్యులు ఆందోళన చెందుతున్నారు.