ఫలించిన వ్యూహం


మిల్లర్లపై కేసులున్నా ధాన్యం ఆడుకునేందుకు అవకాశం

పునరుద్ధరించని సీఎంఆర్‌ ట్యాగింగ్‌

73 తనిఖీలకు 12 కేసులు నమోదు..

రోజులు గడుస్తున్నా లభించని పరిష్కారం

అధికారుల తీరుపై విస్తుపోతున్న మిల్లర్లు

 

విజయనగరం కంటోన్మెంట్‌: పెద్దయ్య గారు పలకరు... చిన్నయ్య గారు చూడరు... కేసులెత్తేస్తామన్నారు. ఇప్పటికీ ఏమీ తేల్చరు. కేసులు నమోదు చేసినా మిల్లింగ్‌కు అవకాశం ఇచ్చారు. కానీ కేసులు ఎత్తేస్తామని నెల రోజులవుతున్నా నేటికీ పట్టించుకోవడం లేదు. ఈ రోజు... రేపంటున్నారు.’ ఇదీ పాపం మిల్లర్ల ఆవేదన. జిల్లా వ్యాప్తంగా ఈ ఏడాది ధాన్యం కొనుగోళ్లు, తరలింపులో పెద్ద హై డ్రామా నడచిన సంగతి తెల్సిందే! అక్రమాలు జరుగుతున్నాయంటూ సాక్షాత్తూ ప్రజా ప్రతి నిధులు గగ్గోలు పెట్టడంతో జిల్లా కలెక్టర్‌ వివేక్‌ యాదవ్‌ అధికార యంత్రా ంగాన్ని గట్టిగా మందలించి తనిఖీల కు పంపించారు. సరిగా చేయకపోవడంతో నోటీసులతో అధికారులను ఉరుకులు పరుగులెత్తించారు. సుమా రు 73 తనిఖీలు చేసి నివేదికలు సిద్ధం చేశారు. కానీ కేసులు మాత్రం పన్నెం డు మాత్రమే! అందులోనూ జాయింట్‌ కలెక్టర్‌ పరిధిలో 9 కేసులు, జిల్లా కలెక్టర్‌ స్థాయిలోనివి మూడు పెద్ద కేసులు. మిల్లర్లు మొండికేసినా... అధికారులు దాడులు తీవ్ర తరం చేయడంతో మిల్లర్లు మిల్లులను మూసేసి నిరసన చేపట్టారు. సమావేశం నిర్వహించుకుని ఇలాగయితే మిల్లులను తెరిచేది లేదని భీష్మించుక్కూచున్నారు. జిల్లా అధికారులు ఏం అనుమతులు ఇచ్చారో..?ఎలా వారిని ఒప్పించారో..? దాడుల తీవ్రత తగ్గిపోయింది. మిల్లులను తెరిచారు. అధికారులతో పోరాటంలో మనదే పై చేయి అయిందనీ. కేసులన్నీ ఎత్తేస్తారనీ మిల్లులను తెరవవచ్చనీ మిల్లర్లు సంబర పడ్డారు. వీరితో పాటు సీజింగ్, కేసులు నమోదయిన వారు కూడా మిల్లులను తెరచి ఎంచక్కా మిల్లింగ్‌ చేస్తున్నారు. అయితే ఇక్కడో ట్విస్టుంది. కేసులు నమోదు అయిన వారు మిల్లింగ్‌ చేసుకుంటున్నా వారికి సీఎంఆర్‌ ట్యాగింగ్‌ను మాత్రం పునరుద్ధరించలేదు. ముందుగా వారనుకున్నట్టు మిల్లులపై కేసులు కూడా ఎత్తేయలేదు. అయితే అక్రమాలు జరుగుతున్నాయంటూ సాక్షాత్తూ జిల్లా అధికారులే గుర్తించి, దాడులు నిర్వహించి వాహనాలను సీజ్‌ చేసినా ఏ నేపథ్యంలో కేసులను ఎత్తివేస్తారని మిల్లర్లు భావిస్తున్నారో తెలియడం లేదు. జిల్లా వ్యాప్తంగా సీజ్‌ చేసిన సరుకులకు సంబంధించి మిల్లింగ్‌ జరుగుతున్నా హోల్డింగ్‌లో ఉన్న సరుకులకు సంబంధించి బిల్లులు కావాల్సి ఉంది. మరో పక్క పూర్తిగా ధాన్యం దాదాపు మిల్లర్ల వద్దే ఉంది. ఇంకా రావాల్సిన ధాన్యం మాత్రం చాలా తక్కువగా ఉంది. 

 

వ్యూహాత్మకంగా వ్యవహరించిన కలెక్టర్‌?

జిల్లాలో మిల్లర్లు అధికారుల మధ్య వాగ్వాదాల మూలంగానే కేసులు విచారించడం లేదని తెలుస్తున్నది. మిల్లర్లు మిల్లులను మూసేసి  ముందుగా వారికి నచ్చజెప్పినట్టు చెప్పి మిల్లింగ్‌కు రంగంలోకి దించిన అధికారులు ఆ తరువాత కేసుల విషయమై మరి తేల్చలేదు. అలాగే నిత్యం మిల్లర్లు తిరుగుతున్నా సమావేశాలు, వీడియో కాన్ఫరెన్సులు, జేసీ క్యాంపులు ఇలా వరుసగా వారికి చుక్కెదురవుతునే ఉన్నాయి తప్ప వారి పనులు చేయడం లేదు. ఇది కాకతాళీయమా.. లేక ఉద్దేశపూరితమా అనేది తెలియడం లేదు. ముఖ్యంగా గతంలో అధికారులతో వాదనలకు దిగడం వల్లే ఈ పరిస్థితి ఇలా వచ్చిందని మాత్రం అనుకుంటున్నారు. సీజన్‌ ముగిసిపోతోంది. సీఎంఆర్‌ వెళ్లిపోతోంది. కేసులు నమోదు చేసిన కొన్ని మిల్లులకు మాత్రం సీఎంఆర్‌ ట్యాగింగ్‌ చేయడం లేదు. మొత్తమ్మీద మిల్లింగ్‌కు ఇబ్బంది లేకుండా... వారి దారికి వెళ్లకుండా అధికారుల వ్యూహం ఫలించినట్టే కనిపిస్తోంది.
Read latest State News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top