వివాదాల శ్రుతి
నటి శ్రుతి నుంచి ప్రాణహాని ఉందంటూ కేసు పెట్టిన మాజీ పనిమనిషి
ఆమెపై ఎవరూ దాడి చేయలేదు : శ్రుతి
బెంగళూరు : బహుభాష నటి, బీజేపీ నేత శ్రుతి మరో వివాదంలో చిక్కుకున్నారు. ఆమె నుంచి తనకు ప్రాణ హాని ఉందని శ్రుతి ఇంటిలో గతంలో పని చేసిన శోభ నగర పోలీసు కమిషనర్ కార్యాలయంలో బుధవారం ఫిర్యాదు చేసింది. అనంతరం ఆమె తన న్యాయవాది వరదారెడ్డితో కలిసి మీడియాతో మాట్లాడారు.
శ్రుతి ఇంటిలో పని చేస్తున్న తనను.. ఇంటి, బెడ్రూం విషయాలు బయటకు చెబితే చంపేస్తామని బెదిరించేవారని చెప్పారు. మే ఒకటో తేదీన ఆమె అనుచరులు సతీష్, బాలు తనపై దాడి చేసినట్లు తెలిపారు. మే రెండవ తేదీ నుంచి అక్కడ పని మానేసినట్లు చెప్పారు. దీంతో వాళ్లు ప్రాంసరి నోట్పై బలవంతంగా తన వేలిముద్రలు తీసుకొని బెదిరిస్తున్నారని తెలిపారు. ప్రాణభయంతో ఇంతవరకు ఫిర్యాదు చేయలేకపోయానన్నారు.
చెడుగా ప్రచారం చేసేది : శ్రుతి
నాలుగు సంవత్సరాలుగా శోభ తన ఇంటిలో పని చేస్తోందని, సొంత చెల్లెలు కంటే ఎక్కువగా ఆమెను చూసుకున్నానని నటి శ్రుతి చెప్పారు. బుధవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. చుట్టుపక్కల వాళ్లతో తన గురించి ఆమె చెడుగా చెప్పేదని తెలిపారు. దీనిపై మే ఒకటో తేదీన ఆమెను ప్రశ్నించానని, ఆ సమయంలో కార్యకర్తలు కూడా ఉన్నారని, ఎవరూ ఆమెపై దాడి చేయలేదని తెలిపారు. తనపై లేనిపోనివి ప్రచారం చేస్తుంటే ఎలా పనిలో పెట్టుకోవాలని ప్రశ్నించారు. కాగా, కేసు దర్యాప్తులోఉందని, పూర్తి వివరాలు ఇప్పుడే చెప్పలేమని పోలీసులు తెలిపారు.