రైలు కింద పడి ఏఎస్సై ఆత్మహత్య
కడప : వైఎస్సార్ జిల్లాలో ఓ ఏఎస్సై ఆత్మహత్యకు పాల్పడ్డారు. కడప నగరం 11వ బెటాలియన్లో ఏఎస్సైగా పనిచేస్తున్న గురునాథ్(54) ఆదివారం రాత్రి ఇంటి నుంచి బయటకు వెళ్లి తిరిగి రాలేదు. దీంతో కుటుంబసభ్యులు నగరంలో ఆరా తీసినా ఫలితం లేకుండా పోయింది.
సోమవారం మధ్యాహ్నం ఎర్రముక్కలపల్లె రైల్వే స్టేషన్ వద్ద పట్టాలపై గుర్తు తెలియని మృతదేహం పడి ఉండగా స్థానికులు గమనించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. రైల్వే పోలీసులు అక్కడికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించి ఆధారాల సాయంతో గురునాథ్గా గుర్తించారు. ఈ మేరకు కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. భార్య, పిల్లలు అక్కడికి చేరుకుని మృతదేహాన్ని గుర్తించారు. ఆయన మృతికి కారణాలు తెలియదని కుటుంబసభ్యులు తెలిపారు. గురునాథ్కు భార్య, ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.