ల్యాప్టాప్ వెనుక కూర్చొని టైప్ చేస్తాడు
బెంగళూరుకు చెందిన అరుణ్కుమార్ ఘనత
శివాజీనగర (బెంగళూరు): మనం కంప్యూటర్ లేదా ల్యాప్టాప్ మందు కూర్చొని అక్షరాలను టైప్ చేయడం మామూలే. అయితే ల్యాప్టాప్ వెనుక కూర్చొని టైపు చేశాడు బెంగళూరుకు చెందిన ఓ వ్యక్తి. కంప్యూటర్ నిపుణుడైన హెచ్.ఎస్.అరుణ్కుమార్ కంప్యూటర్ కీబోర్డును ఎటునుంచైనా టైప్ చేయగలరు.
గతంలో అనేకసార్లు ప్రదర్శనలిచ్చిన ఆయన తాజాగా గురువారం బెంగళూరు ప్రెస్క్లబ్లో ల్యాప్టాప్ వెనుక నుంచి కీబోర్డులో అక్షరాలను వేగంగా టైప్ చేస్తూ అందరినీ ఆశ్చర్యపరిచారు. ఇటీవల నిమిషంలోనే 400 అక్షరాలను టైప్ చేసినందుకు లిమ్కా బుక్ ఆఫ్ రికార్డులో చోటు దక్కిందని అరుణ్కుమార్ తెలిపారు. దీనికి సంబంధించిన టైపింగ్ విధానాలను తాను రూపొందించానని, అనేక మంది ప్రధానులు, రాష్ట్రపతుల ముందు ప్రదర్శించేందుకు అవకాశమివ్వాలని కోరినా అనుమతి రాలేదని పేర్కొన్నారు.