ఉత్తుత్తి భవనాలకు మరో శంకుస్థాపన

ఉత్తుత్తి భవనాలకు మరో శంకుస్థాపన


డిజైను లేదు.. టెండరూ లేదు!

ఈసారి ప్రభుత్వ భవన సముదాయానికి రాయపూడిలో జైట్లీతో


సాక్షి, అమరావతి: ఊహల రాజధాని అమరావతిలో మరో శంకుస్థాపనకు రాష్ర్టప్రభుత్వం సిద్ధమయ్యింది. ఇప్పటికే అనేక శంకుస్థాపనలు, పలుమార్లు భూమి పూజలు చేసిన ప్రభుత్వం ప్రతి నెలా ఏదో ఒక హడావుడి కార్యక్రమం నిర్వహిస్తున్న సంగతి తెల్సిందే. అందులో భాగంగా ఈసారి ప్రభుత్వ భవనాల సముదాయానికి శంకుస్థాపన చేసేందుకు శ్రీకారం చుట్టింది. కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీతో శుక్రవారం దీనికి శంకుస్థాపన చేయించనుంది. వాస్తవానికి ఈ కాంప్లెక్స్ రూపురేఖలపై ఇంకా ప్రభుత్వానికే స్పష్టత లేదు. ఆ మాటకొస్తే అసలింత వరకూ దాని డిజైనే ఖరారు కాలేదు. ఇప్పట్లో దీనికి టెండర్లు పిలిచే పరిస్థితి కూడా లేదు.



మరో ఏడాదైనా ఈ నిర్మాణం ప్రాంభమవుతుందో లేదో తెలియని పరిస్థితి. అలాంటి ఈ కాంప్లెక్స్‌కు తుళ్లూరు మండలం రాయపూడి సమీపంలో జైట్లీతో శంకుస్థాపన చేయించాలని సీఎం చంద్రబాబు నిర్ణయించారు. అరుణ్ జైట్లీ హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో విజయవాడకు 11.40కి చేరుకుంటారు. గుంటూరు జిల్లా తుళ్లూరు మండలంలోని రాయపూడి గ్రామంలో మధ్యాహ్నం 3.30 నుంచి 3.45 గంటల మధ్య శంకుస్థాపన చేస్తారు. ఈ కార్యక్రమంలో గౌరవ అతిధిగా కేంద్ర మంత్రి ఎం. వెంకయ్యనాయుడు కూడా పాల్గొంటారు. శంకుస్థాపన సందర్భంగా జరిగే బహిరంగ సభ  అనంతరం జైట్లీ విజయవాడలో బీజేపీ ఏపీ కమిటీ ఏర్పాటు చేసే సమావేశంలో పాల్గొంటారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇచ్చే విందుకు హాజరౌతారు.



ఈ పర్యటనలో భాగంగా జైట్లీ  ఏపీ పరిపాలనా భవనాలతో పాటు రూ. 1,016 కోట్లతో నిర్మించే  ఏడు గ్రిడ్ రోడ్లు, రూ. 461 కోట్లతో నిర్మించే  స్ట్రామ్ వాటర్ డ్రైనేజీ పనులకు శంకుస్థాపన చేస్తారు. సాయంత్రం 6.00 గంటలకు విజయవాడ నుంచి  ప్రత్యేక విమానంలో ఢిల్లీ బయలుదేరి వెళతారు. శంకుస్థాపన కార్యక్రమం జరిగే ప్రాంతంలో నిర్వహించనున్న బహిరంగ సభ కోసం దాదాపు 100 ఎకరాలలో భూమిని చదును చేసినట్లు అధికారులు చెబుతున్నారు. వీఐపీల వాహనాల పార్కింగ్ కోసం మరో 29 ఎకరాలను చదును చేసినట్లు వారు తెలిపారు. అంతేకాక శంకుస్థాపన జరుగుతున్న ప్రదేశానికి దారితీసే అనేక రోడ్లను తాత్కాలికంగా నిర్మించడానికి, మరమ్మతులు చేయడానికి భారీగా ఖర్చుచేశారు. బహిరంగ సభకు భారీ సంఖ్యలో జనాన్ని, కళాశాలల విద్యార్థినీ విద్యార్థులను తరలించడానికిప్రత్యేకంగా ఏర్పాట్లు చేశారు. పలు కాలేజీలకు, స్కూళ్లకు సెలవులు ప్రకటించారు.



రెండున్నరేళ్లుగా అన్నీ శంకుస్థాపనలే..

పేరుకు ప్రపంచస్థాయి రాజధాని.. అంతర్జాతీయ స్థాయిలో ప్రచారం. రెండున్నరేళ్లు గడిచాయి. కానీ అక్కడ ఒక్క ఇటుక నిలబెట్టలేదు. ఒక్క తట్టమట్టి కదిలించలేదు. కోట్లు కుమ్మరిస్తూ పదేపదే శంకుస్థాపనలు మాత్రం చేసుకుంటూ పోతున్నారు. ఇప్పటివరకూ అమరావతిలో రాజధానికి సంబంధించిన ఒక్కటంటే ఒక్క నిర్మాణాన్నీ మొదలు పెట్టిన పాపాన పోలేదు. వెలగపూడిలో హడావుడిగా అరకొర సదుపాయాలతో నిర్మిస్తున్న తాత్కాలిక సచివాలయం తప్ప ప్రధానమైన నిర్మాణాలేవీ పునాదులు కాదు కదా కనీసం డిజైన్‌కు కూడా నోచుకోలేదు. ఇక శంకుస్థాపనల విషయానికొస్తే..



తాళ్లాయపాలెంలో భూమిపూజ:   2015 జూన్ ఆరో తేదీన తుళ్లూరు మండలం తాళ్లాయపాలెంలో ముఖ్యమంత్రి చంద్రబాబు రాజధానికి ఆర్భాటంగా భూమిపూజ చేశారు. కుటుంబసభ్యులతో కలసి పూజ నిర్వహించి పెద్ద బహిరంగ సభ నిర్వహించారు. ఆ తర్వాత భూమిపూజ జరిగిన ఈ ప్రాంగణానికి భద్రత పేరుతో అప్పట్లో అక్కడ ప్రత్యేక పోలీస్ పికెట్ ఏర్పాటు చేశారు. కొన్ని నెలలపాటు పోలీసులు షిఫ్ట్‌ల వారీగా అక్కడ కాపలా కాశారు. ప్రస్తుతం అక్కడ ఎటువంటి నిర్మాణం జరక్కపోగా ఆ ప్రాంతమంతా ఖాళీగా ఉంది. అక్కడ భూమిపూజ జరిగిందనే విషయాన్ని కూడా చాలామంది మరిచిపోయారు.



ఉద్ధండరాయునిపాలెంలో శంకుస్థాపన: 2015 అక్టోబర్ 22న దసరా పండుగరోజు తుళ్లూరు మండలం ఉద్ధండరాయునిపాలెంలో రూ.250 కోట్లకుపైగా ఖర్చు పెట్టి శంకుస్థాపన నిర్వహించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా ఈ శంకుస్థాపన చేయించగా గవర్నర్ నరసింహన్, తెలంగాణ ముఖ్యమంతి కేసీఆర్, సింగపూర్ మంత్రి ఈశ్వరన్, హైకోర్టు చీఫ్ జస్టిస్, పలువురు కేంద్రమంత్రులు హాజరయ్యారు. రాష్ట్రం నలుమూలల నుంచి జనాన్ని సమీకరించడంతోపాటు పవిత్రత కోసమంటూ 16 వేల గ్రామాలు, పుణ్యక్షేత్రాలు, పుణ్య నదుల నుంచి మట్టి, నీరు సేకరించారు. అఖండజ్యోతి పేరుతో అన్ని చోట్ల నుంచి జ్యోతులను వెలిగించి శంకుస్థాపన ప్రాంగణానికి తెప్పించారు. యాగాలు, పూజలు కూడా చేయించారు.



సేకరించిన మట్టితోనే రాజధాని నిర్మాణాలన్నీ చేపడతానని చంద్రబాబు ప్రకటించడంతో ప్రధాని మోదీ కూడా పార్లమెంటు నుంచి మట్టి, యమునా నది నుంచి నీరు తెచ్చి ఆయనకిచ్చారు.అవి తుళ్లూరు తహసీల్దార్ కార్యాలయంలో భద్రంగా ఉండగా, మిగిలినవాళ్లిచ్చిన మట్టి వర్షాలకు కొట్టుకుపోయింది. నీళ్లు ఏమయ్యాయో తెలియదు. అఖండ జ్యోతిని అమరావతి అమరేశ్వరాలయానికి పంపించారు.ఏడాది దాటిపోయినా ఉద్ధండరాయునిపాలెంలో శంకుస్థాపన చేసిన ప్రాంతంలో ఒక్క నిర్మాణం మొదలు కాలేదు. శిలాఫలకం, శిథిలమైన యాగశాల, రాజధాని త్రీడీ నమూనా షెడ్డే  ఉన్నాయి.



వెలగపూడిలో ‘తాత్కాలికం : ఈ ఏడాది ఫిబ్రవరి 17న వెలగపూడిలో తాత్కాలిక సచివాలయానికి శంకుస్థాపన చేశారు. నిర్మాణం పూర్తవకుండానే కృష్ణా పుష్కరాలు కారణంతో జూన్‌లో ఒక గదిని సిద్ధం చేసి సీఎం దానికి ప్రారంభోత్సవం చేశారు.ఇటీవలే దసరా తర్వాత రోజు అందులోని తన కార్యాలయానికి ప్రారంభించారు. అంతకు కొద్దిరోజుల  నుంచి మంత్రులంతా తమ ఆఫీసులకు వరుసగా ప్రారంభోత్సవాలు చేసుకున్నారు. దీని రూ.600 కోట్లకుపైగా ఖర్చు చేశారు. ఇది వెయ్యి కోట్లకు చేరుతుందని సీఆర్‌డీఏ అధికారులు చెబుతున్నారు.

 

ఇంకా డిజైన్ల అన్వేషణలోనే సీఆర్‌డీఏ

రాజధాని ప్రాంతంలో 900 ఎకరాల్లో అసెంబ్లీ, హైకోర్టులను ఐకానిక్ భవనాలుగా నిర్మించాలని, సచివాలయం, విభాగాధిపతులు, శాఖాధిపతులు, కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు, అధికారులు, ఉద్యోగుల క్వార్టర్లు వంటి భవనాలను ప్రభుత్వ కాంప్లెక్స్‌లో నిర్మించాలని రాష్ర్టప్రభుత్వం నిర్ణయించింది. ఈ భవనాల డిజైన్ల కోసం అంతర్జాతీయ స్థాయిలో పోటీ నిర్వహించి జపాన్‌కు చెందిన మకి అసోసియేట్స్‌ను ఎంపిక చేశారు. కానీ ఆ డిజైన్లపై తీవ్ర విమర్శలు రావడంతో చాలా రోజులు నాన్చి కొద్దిరోజుల క్రితం ఆ సంస్థతో కుదుర్చుకున్న ఒప్పందాన్ని ప్రభుత్వం రద్దు చేసుకుంది. జపాన్ సంస్థతో ఒప్పందం రద్దు చేసుకున్నాక కొత్త డిజైన్ల కోసం సీఆర్‌డీఏ, సీసీడీఎంసీలు అంతర్జాతీయ స్థాయిలో భారీ ఎత్తున అన్వేషణ సాగిస్తున్నాయి.



సరైన ఆర్కిటెక్చర్ కోసం రెండు రోజుల క్రితమే సీఆర్‌డీఏ మళ్లీ టెండర్లు పిలిచింది. వివిధ సంస్థలు టెండర్లు కోడ్ చేసి ప్రతిపాదించిన డిజైన్లలో ఒక దాన్ని ఎంపిక చేసి వారితో ఒప్పందం కుదుర్చుకోవాలి. ఆ తర్వాత ఆ సంస్థ అన్ని భవనాలకు సంబంధించి పూర్తిస్థాయి డిజైన్లను సమర్పిస్తుంది. ఇందుకు అనేక డిజైన్ సంస్థల సహకారంతోపాటు వందలాది మంది ఆర్కిటెక్చర్లు పనిచేయాల్సి ఉంది. ఈ ప్రక్రియంతా నిర్వహించడానికి కనీసం సంవత్సరం పడుతుంది. అప్పుడు తుది డిజైన్ల ఆధారంగా నిర్మించాల్సిన భవనాలకు ప్రభుత్వం టెండర్ల ప్రక్రియ నిర్వహించి నిర్మాణ సంస్థలను ఎంపిక చేయాలి. ఈ కాంప్లెక్స్ నిర్మాణానికి రూ.5,600 కోట్లు, సముదాయంలో మౌలిక వసతులకు మరో నాలుగు వేల కోట్లు అవసరమని ప్రభుత్వం అంచనా వేసింది.



ఈ సొమ్మును అంతర్జాతీయ రుణ సంస్థల నుంచి అప్పుగా తీసుకోవడానికి ప్రభుత్వం ఎడతెగని ప్రయత్నాలు చేస్తున్నా ఇంతవరకూ ఎటువంటి ఆశ కనిపించలేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఆలూ లేదు, చూలూ లేదు కొడుకు పేరు సోమలింగం సామెత చందంగా అసలు ఎలా ఉండాలో తెలియని ప్రభుత్వ కాంప్లెక్స్‌కు అరుణ్ జైట్లీతో శంకుస్థాపన చేయించనుండడం విశేషం. 2015 జూన్ ఆరో తేదీన తాళ్లాయపాలెంలో భూమిపూజ, 2015 అక్టోబర్ 22న ఉద్ధండరాయునిపాలెంలో ప్రధానితో శంకుస్థాపన చేయించినట్లే ఈసారి రాయపూడిలో దీనికి జైట్లీతో శంకుస్థాపన చేయిస్తున్నారు.

 

2015 జూన్ 6    

రాజధానికి తాళ్లాయపాలెంలో

ముఖ్యమంత్రి చంద్రబాబు భూమిపూజ

 

2015 అక్టోబర్ 22

దసరా నాడు ఉద్ధండరాయునిపాలెంలో భారీ ఖర్చుతో ప్రధాని మోదీ చేతుల మీదుగా శంకుస్థాపన

 

2016 ఫిబ్రవరి 17

వెలగపూడిలో తాత్కాలిక సచివాలయానికి శంకుస్థాపన

రాయపూడిలో పరిపాలనా భవనాల శంకుస్థాపనకు  జైట్లీ రాక

Read latest State News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top