నిద్రలో మూత్రం పోస్తున్నాడని..
♦ కుమారుడి మర్మాంగానికి రబ్బర్ బ్యాండ్
♦ ఓ తండ్రి కిరాతకం..
బెంగళూరు: నిద్రలో మూత్రం పోస్తున్నాడనే నెపంతో ఓ తండ్రి ఐదేళ్ల కుమారుడి మర్మాంగానికి రబ్బర్ బ్యాండ్ వేసి వేధించాడు. ఈ ఘటన కర్ణాటకలోని మైసూర్ జిల్లా పిరియాపట్టణంలో గురువారం వెలుగుచూసింది. దొడ్డపరివార వీధికి చెందిన నంజనాయక కూలి పనులు చేసుకుంటూ కుమార్తె (8), కుమారుడు(5)లతో కలసి జీవిస్తున్నాడు. నంజనాయక భార్య కొద్ది సంవత్సరాల క్రితం మృతి చెందడంతో పిల్లలిద్దరి ఆలనపాలన నంజనాయకే చూసుకోసాగాడు.
భార్య బతికి ఉన్న సమయం నుంచి తాగుడుకు అలవాటు పడ్డ నంజనాయక రోజు తాగి వచ్చి భార్య, పిల్లలను కొట్టేవాడు. కొద్ది కాలానికే భార్య మృతి చెందడంతో నంజనాయక ఆగడాలకు అడ్డు లేకుండా పోయింది. పిల్లలను నంజనాయక వేధిస్తున్నట్లు తెలుసుకున్న బంధువులు బాలుడిని అంగన్వాడీ కేంద్రంలో వదిలేసారు. కాగా తను పూర్తిగా మారానని ఇకపై తన కుమారుడిని వేధించనంటూ కేంద్రం కార్యకర్తలను నమ్మించి కొద్ది రోజులకే కుమారుడిని తనతో తెచ్చుకున్న నంజనాయక తిరిగి బాలుడిపై వేధింపుల పర్వం కొనసాగించాడు.
ఈ క్రమంలో గత వారం రోజులుగా నిద్రలో మూత్రం పోస్తున్నాడనే నెపంతో బాలుడి మర్మాంగానికి రబ్బర్బ్యాండ్ వేసి చిత్రహింసలకు గురి చేశాడు. గురువారం బాలుడు తీవ్ర అస్వస్థతకు గురికావడంతో అంగన్వాడీ కార్యకర్తలు ఆసుపత్రికి తరలించి చికిత్స అందించి ఆరా తీయగా విషయం వెలుగు చూసింది. దీంతో అంగన్వాడీ కార్యకర్తలు, మహిళా శిశు సంక్షేమశాఖ అధికారుల ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితుడిపై పోస్కో చట్టం కింద కేసు నమోదు చేశారు.