ముగ్గురిని బలి తీసుకున్న మద్యం మత్తు
కరీంనగర్: రోడ్డు పక్క ఆగి ఉన్న లారీని వేగంగా వచ్చిన కారు ఢీకొట్టిన ఘటనలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. కరీంనగర్ ఆటోనగర్ వద్ద బైపాస్ రోడ్డులో శనివారం మధ్యాహ్నం ఈ ఘటన చోటు చేసుకుంది. రోడ్డు పక్క ఆగి ఉన్న లారీని గోదావరిఖని వైపు వేగంగా వెళ్తున్న కారు ఢీ కొట్టింది. దీంతో కారు నుజ్జునుజ్జుకాగా అందులో ముగ్గురిలో ఒకరు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మిగతా ఇద్దరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. మృతులు మహారాష్ట్రకు చెందిన వారిగా భావిస్తున్నారు. కారులో మద్యం బాటిల్ లభించటంతో డ్రైవర్ మత్తులో అతివేగంగా వెళ్లి లారీని ఢీకొట్టి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.