షోలాపూర్లో తెలుగు హవా
- తెలంగాణకు చెందిన 22 మంది కార్పొరేటర్లుగా గెలుపు
- వీరిలో 12 మంది మహిళలే.. మరోసారి గెలిచిన రాగిణి
సాక్షి ముంబై: షోలాపూర్ మున్సిపల్ కార్పొరేషన్లో తెలంగాణ ప్రజలు తమ సత్తాను చాటుకున్నారు. సుమారు 40 శాతానికిపైగా తెలంగాణ ప్రజలున్న షోలాపూర్లో 22 మంది తెలుగు అభ్యర్థులు కార్పొరేటర్లుగా విజయం సాధించారు. వీరిలో 12 మంది మహిళలే ఉండడం విశేషం. అదే విధంగా గెలిచిన అభ్యర్థులలో అత్యధికంగా కరీంనగర్ (పాత) జిల్లా వాసులున్నారు. అంతేకాకుండా బీజేపీ నుంచి ఎక్కువ మంది గెలుపొందారు. మూడు శతాబ్దాల కిందటే మహారాష్ట్రకు వలసవచ్చిన తెలంగాణ ప్రజలు షోలాపూర్తోపాటు ముంబై, భివండీ, ఠానే, అహ్మద్నగర్, పుణే తదితర జిల్లాల్లో స్థిరపడ్డ సంగతి తెలిసిందే.
అయితే షోలాపూర్లో మాత్రం అనేక మంది అన్ని రంగాల్లో ఎదిగారు. ముఖ్యంగా రాజకీయాల్లో కూడా గత అనేక సంవత్సరాలుగా రాణిస్తున్నారు. ఇప్పటి వరకు షోలాపూర్ మున్సిపల్ కార్పొరేషన్లతోపాటు ఎమ్మెల్యేలుగా కూడా తెలుగు ప్రజలు రాణించారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని ఈ సారి కూడా కార్పొరేషన్ ఎన్నికల్లో తెలుగు ప్రజలకు అన్ని పార్టీలు ప్రాధాన్యమిచ్చాయి. దీంతో బీజేపీ నుంచి అత్యధికంగా 11 మంది గెలుపొందగా శివసేన నుంచి ఎనిమిది మంది, కాంగ్రెస్ నుంచి ఇద్దరు, సీపీఎం నుంచి ఒక అభ్యర్థి గెలుపొందారు. కాగా, మునుపటితో పోలిస్తే ఈసారి కార్పొరేటర్ల సంఖ్య కొంత తగ్గింది.
షోలాపూర్లో విజయం సాధించిన అభ్యర్థుల వివరాలు..
బీజేపీ: పోసా రాధిక, బిర్కు రామేశ్వరి, గడ్డం విజయలక్ష్మి, వల్యాల్ నాగేష్, బోమడ్యాల్ అవినాష్, బత్తుల శశికళ, రికమల్లే శ్రీనివాస్, మదుగుల ప్రతిభా, యన్నం కాంచన, కొండి అనితా, పురుడు వరలక్ష్మి.
శివసేన: కోటె దేవేంద్ర, కోటె ప్రథమేష్, సోమల్ సావత్రి, గుర్రం మీరా, కోటా విఠల్, అంకారం కుముద్, కోటే మహేష్, కొండ్యాల్ వినాయక్.
కాంగ్రెస్: పుళారే శ్రీదేవి, కరుగులే వైష్ణవి.
సీపీఎం: ఆడం కామిని.
ఠానేలో ఆమె మరోసారి..
ఠానే మున్సిపల్ కార్పొరేషన్లో కూడా ఈ సారి బైరిశెట్టి రాగిణి విజయం సాధించారు. హైదరాబాద్కు చెందిన బైరిశెట్టి రాగిణి 2012 ఎన్నికల్లో బీజేపీ నుంచి పోటీ చేసి పరాజయం పాలైంది. ఈ సారి ప్రభాగ్ నంబరు 5 సి నుంచి శివసేన టికెట్పై పోటీ చేసిన ఆమెకు 8,437 ఓట్లు పోలవ్వగా ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి స్వప్నాలి సాల్వీకి 6,182 ఓట్లు పోలయ్యాయి. ఇలా 2,255 ఓట్ల మెజార్టీతో ఆమె విజయం సాధించారు. రాగిణి బైరిశెట్టితోపాటు అయిదో నంబరు ప్రభాగ్లో విజయం సాధించిన నలుగురు అభ్యర్థులు శివసేన వారే కావడం మరో విశేషంగా చెప్పుకోవచ్చు.