రోడ్డు ప్రమాదంలో ఇద్దరి దుర్మరణం
వడమాలపేట: చిత్తూరు జిల్లా వడమాలపేట టోల్గేట్ వద్ద శనివారం జరిగిన రోడ్డుప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. తమిళనాడుకు చెందిన కడలూరు జిల్లా వెన్నారం గ్రామానికి చెందిన ఒక కుటుంబం కారులో తిరుమల శ్రీవారి దర్శనార్థం బయలుదేరారు. టోల్గేట్ వద్ద పుత్తూరు బైపాస్ రోడ్డులో నిలిచిఉన్న లారీని వేగంగా వచ్చిన కారు ఢీకొంది.
ఈ సంఘటనలో బావా మరదళ్లు రామకృష్ణ(38), అనసూయ(35) అక్కడికక్కడే మృతి చెందారు. ఇద్దరు చిన్నారులతో సహా నలుగురు గాయపడ్డారు. ప్రమాదం జరిగినపుడు కారులో డ్రైవర్తో సహా ఏడుగురు ఉన్నారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. గాయపడినవారిని చిత్తూరు ఆస్పత్రికి తరలించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.