యువీ-ధోనిల సరికొత్త రికార్డు

యువీ-ధోనిల సరికొత్త రికార్డు


కటక్: ఇంగ్లండ్ తో ఇక్కడ బారాబతి స్టేడియంలో జరుగుతున్న రెండో వన్డేలో యువరాజ్ సింగ్-మహేంద్ర సింగ్ ధోని జంట సరికొత్త రికార్డు నమోదు చేసింది. ఈ మ్యాచ్లో యువరాజ్ సింగ్-ధోనిలు చెలరేగి ఆడి నాల్గో వికెట్కు ఇంగ్లండ్ పై అత్యధిక పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేశారు. ఈ మ్యాచ్ లో 173 పరుగుల అజేయ భాగస్వామ్య మార్కును చేరడం ద్వారా ఆ జట్టుపై నాల్గో వికెట్కు అత్యధిక భాగస్వామ్యాన్ని నమోదు చేసిన ఘనతను సొంతం చేసుకున్నారు. అంతకుముందు 2012లో దక్షిణాఫ్రికా జోడి హషీమ్ ఆమ్లా-ఏబీ డివిలియర్స్లు ఇంగ్లండ్ పై నాల్గో వికెట్ కు నమోదు చేసిన 172 పరుగుల అజేయ భాగస్వామ్యమే ఇప్పటికే వరకూ అత్యధికం. దాన్ని నాలుగేళ్ల తరువాత యువీ-ధోనిలు సవరించి కొత్త రికార్డు నమోదు చేశారు.



ఈ మ్యాచ్లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ కు దిగిన విరాట్ సేన తడబడింది. 25 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ తరుణంలో యువీ-ధోనిల జోడి సమయోచితంగా బ్యాటింగ్ చేసి ఇంగ్లండ్ బౌలర్లకు పరీక్షగా నిలిచారు.





తొలుత యువరాజ్ సింగ్ 56 బంతుల్లో 8 ఫోర్లతో హాఫ్ సెంచరీ చేయగా, ఆ తరువాత కాసేపటికి ధోని 68 బంతుల్లో 6 ఫోర్లు, 1 సిక్స్ సాయంతో అర్థ శతకం నమోదు చేశాడు. ఆపై యువరాజ్ అదే ఫామ్ ను కొనసాగించి సెంచరీ మార్కును చేరాడు. యువరాజ్ సింగ్ 98 బంతుల్లో 15 ఫోర్లు, 1 సిక్సర్ సాయంతో శతకం సాధించాడు. ఇది యువరాజ్  కెరీర్లో 14 వన్డే సెంచరీ.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top