శ్రీలంకతో మూడో టెస్టు: గెలుపు దిశగా పాక్
పల్లెకెలె: శ్రీలంకతో జరుగుతున్న నిర్ణయాత్మక మూడో టెస్టులో పాకిస్తాన్ అనూహ్యంగా పుంజుకుని గెలుపు దిశగా సాగుతోంది. 377 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పాక్ ఓ దశలో 13 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయింది. అయితే ఓపెనర్ షాన్ మసూద్ (198 బంతుల్లో 114 బ్యాటింగ్; 11 ఫోర్లు; 1 సిక్స్), సీనియర్ బ్యాట్స్మన్ యూనిస్ ఖాన్ (166 బంతుల్లో 101 బ్యాటింగ్; 9 ఫోర్లు) నిలకడైన ఆటతీరుతో జట్టును ఆదుకున్నారు. ఫలితంగా సోమవారం నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి 63 ఓవర్లలో రెండు వికెట్లకు 230 పరుగులు చేసింది.
చివరి రోజు గెలిచేందుకు ఇంకా 147 పరుగులు అవసరం కాగా చేతిలో ఎనిమిది వికెట్లున్నాయి. మూడో వికెట్కు ఈ జోడి ఏకంగా 217 పరుగుల అజేయ భాగస్వామ్యాన్ని నమోదు చేసింది. అంతకుముందు శ్రీలంక తమ రెండో ఇన్నింగ్స్లో 95.4 ఓవర్లలో 313 పరుగులకు ఆలౌటయింది. మాథ్యూస్ (252 బంతుల్లో 122; 12 ఫోర్లు; 1 సిక్స్) సెంచరీ చేయగా... చండిమాల్ (103 బంతుల్లో 67; 8 ఫోర్లు) అర్ధ సెంచరీ చేశాడు. ఇమ్రాన్ ఖాన్కు ఐదు వికెట్లు లభించాయి.