సిరీస్ ముగిశాక తేల్చుకోవాల్సింది
విండీస్ సహచరులపై శామ్యూల్స్ వ్యాఖ్య
జమైకా: భారత్లో సిరీస్ ముగిసిన తర్వాత సమస్యలను పరిష్కరించుకుంటే సరిపోయేదని వెస్టిండీస్ మిడిలార్డర్ బ్యాట్స్మన్ మార్లన్ శామ్యూల్స్ అన్నాడు. భారత పర్యటన నుంచి అర్ధాంతరంగా వైదొలగడం తనకు ఇష్టం లేదని మరోసారి వెల్లడించాడు. టూర్ను బహిష్కరించాలని సహచరులు తీసుకున్న నిర్ణయంలో తన పాత్ర లేదని స్పష్టం చేశాడు. ‘నా మాటలకు కట్టుబడి ఉన్నా. సిరీస్ గురించిగానీ, ఇతర అంశాల గురించిగానీ నన్నెవరూ ప్రత్యేకంగా అడగలేదు. రూమ్లో చాలా మంది ఉన్నారు.
ఎవరూ దేని గురించి మాట్లాడలేదు. కానీ ఓ రోజు నేనే వెళ్లి ఈ విషయాల గురించి అడిగా. వాళ్ల స్పందన నాకు నచ్చలేదు. ఒకవేళ సంతృప్తి చెంది ఉంటే మొదట నేనే బయటకు వచ్చి మాట్లాడేవాణ్ని. ఎందుకంటే నేను ఏ విషయాన్నైనా నిర్మోహమాటంగా బయటకు చెబుతా. బ్రేవోతో జరిగిన చర్చలను నేను మొదట బయటపెట్టా. ఓవరాల్గా సిరీస్ ముగిశాక సమస్యలను పరిష్కరించుకుంటే సరిపోయేది’ అని శామ్యూల్స్ పేర్కొన్నాడు. డబ్ల్యుఐపీఏ అధ్యక్షుడు వేవెల్ హైండ్స్ ఈ సమస్యకు మూల కారకుడని విమర్శించారు.
సంబంధిత వార్తలు