భారత్ ఫైనల్ ప్రత్యర్థి విండీస్
మిర్పూర్:అండర్ 19 వరల్డ్ కప్లో వెస్టిండీస్ ఫైనల్ కు చేరింది. గురువారం ఆతిథ్య బంగ్లాదేశ్తో జరిగిన రెండో సెమీ ఫైనల్లో విండీస్ మూడు వికెట్ల తేడాతో గెలిచి తుదిపోరుకు సిద్ధమయ్యింది. బంగ్లాదేశ్ నిర్దేశించిన 227 పరుగుల లక్ష్యాన్ని 48.4 ఓవర్లలో ఏడు వికెట్లను కోల్పోయి ఛేదించిన విండీస్ ఫైనల్ బెర్తును ఖరారు చేసుకుంది. విండీస్ ఆటగాళ్లలో గిర్డాన్ పోప్(38), హేట్మైర్ (60), స్ప్రింగర్(62 నాటౌట్) రాణించి జట్టు విజయానికి తోడ్పడ్డారు.
అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకున్న బంగ్లాదేశ్ నిర్ణీత ఓవర్లలో 226 పరుగులు నమోదు చేసింది. బంగ్లా ఆటగాళ్లలో హసన్ మీరజ్(60) రాణించగా, జోయరాజ్ షేక్(35), మహ్మద్ సైఫుద్దీన్(36)ఫర్వాలేదనపించారు. విండీస్ బౌలర్లలో కీమో పౌల్ మూడు వికెట్లు సాధించగా, స్పింగర్, హోల్డర్ లకు తలో రెండు వికెట్లు లభించాయి.తొలి సెమీ ఫైనల్లో శ్రీలంక పై గెలిచిన భారత్ ఇప్పటికే ఫైనల్ కు చేరిన సంగతి తెలిసిందే. ఫిబ్రవరి 14 వ తేదీన భారత్- విండీస్లు తుది పోరులో అమీతుమీ తేల్చుకోనున్నాయి.