ధోని ఆశ్చర్యం
పుణే: శ్రీలంకతో జరిగి తొలి టి20లో ఓటమిపై టీమిండియా కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. ఓటమి నుంచి సానుకూల పాఠాలు నేర్చకుంటామని చెప్పాడు. తమ షాట్ సెలక్షన్ బాలేదని, బ్యాటింగ్ ను సమీక్షించుకుంటామని వెల్లడించాడు. మంగళవారం శ్రీలంకతో జరిగిన మొదటి టి20లో భారత్ 5 వికెట్లతో ఓడిపోయింది.
'గత నెలలో తాము ఆడినవాటితో పోలిస్తే ఇక్కడి పిచ్ చాలా భిన్నంగా ఉంది. ఈ రోజు అందరికీ బ్యాటింగ్ చేసే అవకాశం దక్కింది. అదే సమయంలో బ్యాట్స్ మన్ పై ఒత్తిడి కూడా ఉంటుంది. నిజమే. ఫలితం మేము ఆశించినట్టు రాలేదు. ఈ మ్యాచ్ ద్వారా సానుకూల అంశాలు నేర్చుకునే అవకాశం కలిగింద'ని ధోని వ్యాఖ్యానించాడు.
'టి20లో ఆలౌట్ కావడం అరుదుగా జరుగుతుంది. మన బ్యాటింగ్ సత్తా ఏమిటో తెలుసుకునేందుకు ప్రతి ఒక్కరినీ పరీక్షించడంతో తప్పేమి లేదు. రజిత, షనక, చమీర పేస్ త్రయం మా బ్యాటింగ్ ను దెబ్బతీసింది. వన్డేలతో పోలిస్తే టి20 మ్యాచ్ లు భిన్నంగా ఉంటాయ'ని ధోని వివరించాడు.