విచారణకు సహకరిస్తా!

విచారణకు సహకరిస్తా!


రాజ్‌కుంద్రా వ్యాఖ్య

సాక్షి, హైదరాబాద్: ఐపీఎల్‌లో బెట్టింగ్‌కు సంబంధించి రెండో దశ విచారణ సందర్భంగా ముద్గల్ కమిటీ ముందు హాజరయ్యేందుకు తాను సిద్ధంగా ఉన్నానని రాజస్థాన్ రాయల్స్ సహ యజమాని రాజ్ కుంద్రా అన్నారు. మరోసారి తనకు తెలిసిన సమాచారం అందజేస్తానని ఆయన చెప్పారు. ‘ఫిక్సింగ్, బెట్టింగ్ విషయంలో మరో సారి ముద్గల్ కమిటీ విచారణ జరపడం మంచి పరిణామం. నాకు దానితో ఎలాంటి సమస్యా లేదు.



ఇప్పటి వరకు నాకు ఇంకా కమిటీ ముందు హాజరు కావాలని పిలుపు రాలేదు. అయితే మున్ముందు విచారణలో అన్ని విధాలా సహకరిస్తా’ అని కుంద్రా వెల్లడించారు. తాను బెట్టింగ్‌కు పాల్పడినట్లుగా ఎప్పుడూ అంగీకరించలేదని రాయల్స్ యజమాని స్పష్టం చేశారు. సంజు శామ్సన్ రూపంలో రాజస్థాన్ రాయల్స్ మరో భారత క్రికెటర్‌ను అందించడం గర్వంగా ఉందని ఆయన అన్నారు. రవీంద్ర జడేజా, స్టువర్ట్ బిన్నీ, రహానేల తర్వాత ఇప్పుడు శామ్సన్ కూడా టీమిండియాకు ఎంపిక కావడం... రాహుల్ ద్రవిడ్‌తో సహా తమ మేనేజ్‌మెంట్‌కు సంతోషాన్నిచ్చిందని కుంద్రా వ్యాఖ్యానించారు.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top