సెహ్వాగ్.. ఇరగదీశాడు!

సెహ్వాగ్.. ఇరగదీశాడు! - Sakshi


విమర్శకులకు ఎప్పుడూ తన బ్యాట్‌తో సమాధానమిచ్చే డాషింగ్ హీరో వీరేంద్ర సెహ్వాగ్.. ఈసారి మాటలతో కూడా గట్టిగా సమాధానం చెప్పాడు. 125 కోట్ల మంది జనాభా ఉన్నా కేవలం రెండు పతకాలు సాధించి దానికే సంబరాలు ఎందుకు చేసుకుంటున్నారంటూ బ్రిటిష్ జర్నలిస్టు పియర్స్ మోర్గాన్ చేసిన వ్యాఖ్యలకు ట్విట్టర్ ద్వారానే సెహ్వాగ్ ఘాటుగా జవాబు చెప్పాడు. ఇది వాళ్లిద్దరి మధ్య మాటల యుద్ధానికి దారితీసింది. ముందుగా మోర్గాన్ చేసిన ట్వీట్‌కు సమాధానంగా, భారతీయులు ప్రతి చిన్న విషయానికీ ఆనందిస్తూనే ఉంటారని సెహ్వాగ్ చెప్పాడు. అది సరేగానీ, క్రికెట్‌ను కనుగొన్నది తామేనంటూ జబ్బలు చరుచుకునే ఇంగ్లండ్ ఇంతవరకు ఒక్కసారి కూడా ప్రపంచకప్ గెలవలేదని, అయినా ఇప్పటికీ ప్రపంచకప్‌లో ఆడుతూనే ఉండటం ఇబ్బందికరంగా ఏమీ లేదా అని ప్రశ్నించాడు. ఒక్కసారిగా సెహ్వాగ్ సమాధానానికి ట్విట్టర్ జనాలు అభిమానులు అయిపోయారు. కొన్ని గంటల్లోనే వేల సంఖ్యలో రీట్వీట్లు, దానికి మించి లైకుల వర్షం కురిసింది.



అయితే అది అక్కడితో ఆగలేదు. సెహ్వాగ్ ట్వీట్‌కు మోర్గాన్ మరోసారి స్పందించాడు. కెవిన్ పీటర్సన్ ఆడి ఉంటే, ఇంగ్లండ్ తప్పనిసరిగా ప్రపంచకప్ గెలిచేదని చెప్పాడు. కానీ హనుమంతుడి ముందు కుప్పగంతులా అన్నట్లు క్రికెట్‌ గురించి సెహ్వాగ్‌కు చెబితే ఎలా? అందుకే వీరూ దానికి కూడా గట్టిగానే చెప్పాడు. అసలు పీటర్సన్ ఇంగ్లండ్ వ్యక్తి కాదని, దక్షిణాఫ్రికాలో పుట్టాడని, అందులోనూ ఆయన 2007 ప్రపంచకప్‌లో ఆడాడని.. అయినా ఇంగ్లండ్ ఓడిపోయిందని చకచకా చెప్పేశాడు. దాంతో ఇక మోర్గాన్ మాట్లాడేందుకు ఏమీ లేక నోరు మూసేశాడు.


 

 

 

 

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top