'ఆటను ఆస్వాదిస్తాడు.. ప్రేమిస్తాడు'
కోల్కతా:'విరాట్ కోహ్లి అంకిత భావం గల క్రికెటర్. ఆటను ఆస్వాదిస్తాడు.. ప్రేమిస్తాడు. ఎప్పుడూ విజయం కోసమే శ్రమిస్తాడు. మనసు పెట్టి ఆడే క్రికెటర్. అతనొక ఆణిముత్యం. టీమిండియాకు దొరికిన వరం. భారత క్రికెట్ భవిష్యత్ విరాట్ కోహ్లి అనడంలో ఎటువంటి సందేహం లేదు' అని మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ ప్రశంసలు వర్షం కురిపించాడు.
వెస్టిండీస్ పర్యటనలో భాగంగా తొలి టెస్టు మ్యాచ్ మొదటి ఇన్నింగ్స్లో డబుల్ సెంచరీ సాధించి ఆ ఘనతను అందుకున్న తొలి భారత కెప్టెన్ గా రికార్డు సృష్టించిన కోహ్లిని గంగూలీ కొనియాడాడు. క్రికెట్ అనే గేమ్కు ఓ గొప్ప ప్రకటనదారుడు ఎవరైనా ఉన్నారంటే అది కోహ్లినేనని ప్రశంసించాడు. ఈ సందర్భంగా 2003లో బ్రిస్బేన్లో ఆసీస్ తో జరిగిన మ్యాచ్ను గంగూలీ గుర్తు చేసుకున్నాడు. ఆ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్లో తాను 144 పరుగుల భారీ శతకం చేయడంతో భారత్ ఓటమి నుంచి గట్టెక్కడంతో పాటు ఆ సిరీస్ డ్రాగా ముగిసిందని ఆనాటి జ్ఞాపకాల్ని నెమరువేసుకున్నాడు. అయితే అప్పడు తాను చేసిన భారీ శతకానికి, ఇప్పుడు విరాట్ చేసిన ద్విశతాకానికి తేడా ఉందన్నాడు. ఇదొక ప్రత్యేకమైన ఇన్నింగ్స్ అని గంగూలీ తెలిపాడు.