విరాట్..కేక!
దంబుల్లా: పరుగుల యంత్రంగా ముద్రపడిన భారత కెప్టెన్ విరాట్ కోహ్లి మరో అరుదైన క్లబ్లో చేరిపోయాడు. శ్రీలంకతో జరిగిన తొలి వన్డేలో కోహ్లి మరో ఘనతను సాధించాడు. సక్సెస్ ఫుల్ ఛేజింగ్ల్లో నాలుగువేల పరుగుల మార్కును కోహ్లి అందుకుని ఆ ఘనత సాధించిన మూడో క్రికెటర్ గా నిలిచాడు. లంకేయులతో మ్యాచ్ లో కోహ్లి అజేయంగా 82 పరుగులు నమోదు చేశాడు. తద్వారా నాలుగు వేల పరుగుల సక్సెస్ ఫుల్ ఛేజింగ్ క్లబ్ లో కోహ్లి చేరిపోయాడు.
అంతకుముందు సచిన్ టెండూల్కర్(5,490), రికీ పాంటింగ్(4,186)లు మాత్రమే దీన్ని సాధించారు. అయితే ఈ ఘనతను సాధించే క్రమంలో విరాట్ కోహ్లి బ్యాటింగ్ సగటు 100.02గా ఉండటం విశేషం. కాగా, ఇక్కడ సచిన్ 55.45 సగటుతో, రికీ పాంటింగ్ 57.34 సగటుతో మాత్రమే ఈ ఫీట్ ను సాధించారు. ప్రస్తుతం విరాట్ ఖాతాలో 28 వన్డే సెంచరీలున్నాయి. అందులో ఛేజింగ్ చేసే క్రమంలో విరాట్ సాధించిన సెంచరీలు 18. వీటిలో 16 సెంచరీలు భారత్ కు విజయాన్ని అందించాయి.