కోహ్లీని కెప్టెన్ చేసే సమయం వచ్చింది
న్యూఢిల్లీ: టీమిండియా కెప్టెన్సీ విషయంపై జట్టు మాజీ డైరెక్టర్ రవిశాస్త్రి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తానేకనుక సెలెక్షన్ కమిటీ చైర్మన్ అయివుంటే మూడు ఫార్మాట్లకు విరాట్ కోహ్లీని కెప్టెన్ను చేసే విషయాన్ని ఆలోచించేవాడినని చెప్పాడు. భారత వన్డే, టి-20 జట్ల ప్రస్తుత కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీని ఆటగాడిగా కొనసాగించేవాడినని రవిశాస్త్రి తన అభిప్రాయాన్ని వెల్లడించాడు.
మూడు ఫార్మాట్లకు నాయకత్వం వహించేందుకు కోహ్లీ సిద్ధంగా ఉన్నడా అన్న ప్రశ్నకు రవిశాస్త్రి అవునని సమాధానం చెప్పాడు. టీమిండియా కెప్టెన్సీ మార్పు గురించి ఆలోచించే సమయం వచ్చిందని అన్నాడు. 2019 ప్రపంచ కప్ వరకు మూడేళ్లకాలంలో భారత్కు మేజర్ టోర్నమెంట్లు లేవని, కొత్త కెప్టెన్ను నియమించేందుకు ఇదే సరైన సమయమని చెప్పాడు. ధోనీని ఆటగాడిగా జట్టులో కొనసాగించాలని అభిప్రాయపడ్డాడు. ధోనీ తన ఆటను ఆస్వాదించేందుకు అనుమతించాలని సూచించాడు. వచ్చే 18 నెలల కాలంలో టీమిండియా ఆడే వన్డేలు, టెస్టుల మధ్య విరామం ఉంది కాబట్టి కొత్త కెప్టెన్ తన సత్తానిరూపించుకునేందుకు అవకాశం ఉంటుందని చెప్పాడు. ప్రస్తుతం టీమిండియా టెస్టు కెప్టెన్గా కోహ్లీ, వన్డే, టి-20 జట్ల సారథిగా ధోనీ వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే.
సంబంధిత వార్తలు