మూడు పతకాలు ఖాయం

మూడు పతకాలు ఖాయం


బాక్సింగ్

 ఆసియా క్రీడల బాక్సింగ్‌లో భారత్‌కు కనీసం మూడు కాంస్య పతకాలు ఖాయమయ్యాయి. మహిళల విభాగంలో ఆదివారం ముగ్గురు భారత బాక్సర్లు మేరీకోమ్, సరితా దేవి, పూజా రాణి సెమీ ఫైనల్లోకి ప్రవేశించారు. వీరు తమ విభాగాల్లో సెమీస్‌లో ఓటమిపాలైనా కనీసం కాంస్యం దక్కుతుంది.


51 కేజీల విభాగంలో మేరీకోమ్ సునాయాసంగా  సి హైజువన్ (చైనా)ను చిత్తు చేసింది. మేరీకంటే 10 ఏళ్లు చిన్నదైన చైనా ప్రత్యర్థి మూడో రౌండ్‌లో కొంత పోటీ ఇవ్వగలిగినా...ఐదు సార్లు ప్రపంచ చాంపియన్‌గా నిలిచిన భారత బాక్సర్ ముందు నిలబడలేకపోయింది. సెమీస్‌లో మేరీకోమ్... వియత్నాంకు చెందిన లి థాయ్ బాంగ్‌తో తలపడుతుంది.




60 కేజీల విభాగంలో సరితాదేవి, సడ్ ఎర్డిన్ (మంగోలియా)పై ఘన విజయం సాధించింది. సెమీస్‌లో సరిత... జినా పార్క్ (కొరియా)ను ఎదుర్కొంటుంది.




 75 కేజీల విభాగం క్వార్టర్స్‌లో పూజా రాణి, చైనీస్ తైపీకి చెందిన షెన్ దారా ఫ్లోరాను ఓడించింది. పదునైన అప్పర్‌కట్‌లతో చెలరేగిన పూజను ప్రత్యర్థి అడ్డుకోలేకపోయింది. సెమీస్‌లో లి కియాన్ (చైనా)తో పూజ పోటీ పడుతుంది.


 


పురుషుల 49 కేజీల విభాగంలో క్వార్టర్స్ చేరేందుకు దేవేంద్రో సింగ్‌కు 87 సెకన్ల సమయం సరిపోయింది. దేవేంద్రో ‘నాకౌట్’ పంచ్‌తో బౌన్‌ఫోన్ (లావోస్)ను చిత్తు చేశాడు. క్వార్టర్స్‌లో అతను షిన్ జాంగున్ (కొరియా)ను ఢీకొంటాడు.










 

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top