ఆ రెండు రికార్డులు బద్దలు కొడతా!
చెన్నై:ఇటీవల ఇంగ్లండ్ తో ముగిసిన చివరిదైన ఐదో టెస్టు తొలి ఇన్నింగ్స్ లో డబుల్ సెంచరీ చేసే అవకాశాన్ని భారత ఓపెనర్ కేఎల్ రాహుల్ తృటిలో కోల్పోయిన సంగతి తెలిసిందే. అతని వ్యక్తిగత స్కోరు 199 పరుగుల వద్ద అనవసరపు షాట్ కు యత్నించి అవుటయ్యాడు. దాంతో అరుదైన అవకాశాన్ని కోల్పోయిన రాహుల్ నిరాశగానే పెవిలియన్కు చేరాడు. అయితే భారత తరపున ఇద్దరికి మాత్రమే సాధ్యమైన ట్రిపుల్ సెంచరీ చేసిన రికార్డును బద్ధలు కొట్టడానికి తన సర్వశక్తులు ఒడ్డుతానని రాహుల్ చెబుతున్నాడు. ఈ మేరకు ఇండియా టు డేకు ఇచ్చిన ఇంటర్య్వూలో రాహుల్ పలు విషయాల్ని వెల్లడించాడు.
'డబుల్ సెంచరీని కోల్పోవడం నిజంగానే బాధగా ఉంది. కాకపోతే క్రికెట్ అనేది ఒక సరదా ఆట. క్రికెట్ లో ఎప్పుడు ఏమి జరుగుతుందో చెప్పలేం. కొన్నిసందర్భాల్లో డకౌట్గా అవుట్ కావడం, డబుల్ సెంచరీని తృటిలో కోల్పోవడం మనం ఊహకు అందదు. మనం ఏమైతై జరుగుతుందని భావిస్తామో.. అది ఎల్లప్పుడూ జరగదు. అలానే నేనే అవుట్ కావడం జరిగింది. ఆ సమయంలో బంతి మిడిల్ స్టంప్కు వస్తుందనే అనుకున్నా. కానీ ఆఫ్ స్టంప్ బయటకు వెళ్లింది. దాన్ని అనవసరంగా ఆడి అవుటయ్యా. ఆ బంతిని షాట్ ఆడకూడదనే అనుకున్నా. కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. దాంతో నవ్వుకోవడమే నా వంతైంది. నా నవ్వుకు 199 కారణాలున్నాయి. కాకపోతే ఆ మ్యాచ్లో విలువైన పరుగులు చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. రాబోయే సీజన్లో నేను బ్యాటింగ్ కు వెళ్లినపుడు కరుణ్ నాయర్, సెహ్వాగ్ల ట్రిపుల్ను బద్దలుకొట్టడానికి యత్నిస్తా' అని రాహుల్ పేర్కొన్నాడు.