ఆటను ఆస్వాదించే వరకు ఆడతా: యువరాజ్
ముంబై: జాతీయ జట్టులోకి పునరాగమనం చేయాలన్న కల రోజురోజుకూ దూరమవుతున్నా... క్రికెట్ను ఆస్వాదించేంతవరకు ఆటలో కొనసాగుతానని భారత సీనియర్ క్రికెటర్ యువరాజ్ సింగ్ స్పష్టం చేశాడు. ‘క్రికెట్ అంటే నాకు పిచ్చి. ఓ చిన్నపిల్లాడిలా దాన్ని ఆస్వాదిస్తా. ఆటను ఆస్వాదించినంతకాలం ఆడుతూనే ఉంటా. ఒకవేళ జాతీయ జట్టులో ఆడే అవకాశం వస్తే దానిపై కూడా దృష్టిపెడతా. ఈ మ్యాచ్ల్లో రాణించి టీమిండియాలో చోటు కోసం ప్రయత్నిస్తా.
ప్రపంచకప్కు ఉండే ప్రత్యేకత వేరు. అది టి20 కావొచ్చు, వన్డేది కావొచ్చు. అందులో ఆడటం చాలా గొప్ప గౌరవం. అయితే ఇప్పటికిప్పుడు రాబోయే టి20 వరల్డ్కప్ గురించి ఆలోచించడం లేదు. ప్రస్తుతానికి ఒక్కో మ్యాచ్పైనే దృష్టిపెడుతున్నా. మ్యాచ్లో ఎలా మెరుగుపడాలో ఆలోచిస్తున్నా. ఇప్పుడైతే ఇదే లక్ష్యం’ అని ముంబైతో రంజీ మ్యాచ్ ఆడేందుకు ఇక్కడకు వచ్చిన యువీ పేర్కొన్నాడు. అమెరికాలో కొత్తగా ఏర్పాటు చేస్తున్న సచిన్-వార్న్ టి20 సిరీస్ను యువీ స్వాగతించాడు. క్రికెట్ను మాస్టర్ ప్రపంచ వ్యాప్తం చేస్తున్నాడని కితాబిచ్చాడు.